ప్రశ్నిస్తే ప్రాణం తీస్తారా? ఆ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు పెట్టాలి: పవన్ కళ్యాణ్ ఫైర్, అక్రమ అరెస్టులా?
అమరావతి: ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? అంటూ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. తమ గ్రామంలో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది.. రహదారి లేదు.. ఇతర సౌకర్యాల కల్పన ఏమైందని ఎమ్మెల్యే అన్నా రాంబాబును ప్రశ్నించినందుకు ఈ రోజు జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు ప్రాణాలు తీసుకొనే పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.
Recommended Video
ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు ప్రాణం తీశారు..
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని సింగరపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబుని.. కోనపల్లిలో పారిశుధ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, రహదారులు లేవు... ఇతర ఏ సౌకర్యాలు లేవని... ఎప్పుడు కల్పిస్తారని జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ప్రశ్నించారు. అందుకు సమాధానం ఇవ్వలేని స్థితిలో ఎమ్మెల్యే రాంబాబు - 'నీ మెడలో పార్టీ కండువా తీయ్...' అని మొదలుపెట్టి సభ్యసమాజం పలకలేని భాషలో మాట్లాడటం సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో రాష్ట్ర ప్రజలు చూశారు. ప్రశ్నించిన ఆ యువకుణ్ణి ప్రజల మధ్యనే బెదిరించిన ఎమ్మెల్యే- తదుపరి తన పార్టీ వ్యక్తుల ద్వారా బెదిరించడం, వివిధ రూపాల్లో ఒత్తిళ్లకు గురి చేసినట్లు మాకు సమాచారం అందింది. ఈ రోజు వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకొన్నారని తెలిసి బాధకు లోనయ్యాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. వెంగయ్య నాయుడు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. .
వెంగయ్యనాయుడు తప్పేంటి?, ఆ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు పెట్టాలి..
తమ గ్రామంలో సౌకర్యాల కోసం ప్రజల తరఫున గళమెత్తి ఎమ్మెల్యేను ప్రశ్నించడమే వెంగయ్య నాయుడు చేసిన తప్పా? అతను తన ఒక్కడి సౌకర్యం కోసం ప్రశ్నించలేదు... ఊళ్ళో ప్రజలందరి కోసం మాట్లాడాడు. ఆ గొంతు అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎందుకు భయం పుట్టించింది. ఆ భయంతోనే వెంగయ్య నాయుడు గొంతు నొక్కే పని ఆ క్షణం నుంచే అధికార పక్షం మొదలుపెట్టింది. బాధ్యత కలిగిన ఎమ్మెల్యే వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉంది. గ్రామంలో కనీస సౌకర్యాల గురించి అడిగినందుకు ప్రాణాలు కోల్పోవలసిందేనా? ఇది వైసీపీ నిరంకుశ పాలనకు నిదర్శనంగా నిలుస్తుంది. తన నియోజకవర్గ ప్రజలకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేనప్పుడు ఆ పదవిలో ఉండి ఏమి ఉపయోగమో సదరు ఎమ్మెల్యే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వెంగయ్య నాయుడు మృతిపై సమగ్ర విచారణ చేయించాలి. అధికార పక్షం ఈ ఆత్మహత్యకు బాధ్యత వహించాలి. అతన్ని బెదిరింపులకు గురి చేసి, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎమ్మెల్యే రాంబాబు, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
దేవాలయాలు, విగ్రహాల ధ్వంసం చేస్తే చర్యలు శూన్యం, కానీ..
రాష్ట్రంలో చోటు చేసుకున్న దేవాలయ ఆస్తులను... విగ్రహాలను ధ్వంసం చేయడం లాంటి దుస్సంఘటనలపై సక్రమరీతిలో దర్యాప్తు చేయించలేని ప్రభుత్వం సోషల్ మీడియాలో ఆ ఘటనలపై పోస్టులు పెట్టారనే నెపంతో జనసేన కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ దగ్గర లక్షీనరసింహ స్వామి ఆలయానికి సంబంధించిన తోరణం విగ్రహంలోని కొంత భాగం దెబ్బ తిన్న క్రమంలో ఆ విషయం మీడియాలో వచ్చిన మాట వాస్తవం. ఈ ఘటనపై పోస్టులు పెట్టారంటూ జనసేన కార్యకర్తలు తోటకూర అనిల్ (ఒంగోలు), నాగ మల్లికార్జున (కడప), దేవేంద్ర కుమార్ (విశాఖపట్నం)లను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి లోపాలను, అందుకు కారకులను గుర్తించాల్సిన పోలీసు శాఖ ఆ బాధ్యతను పక్కనపెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మా పార్టీవారిని ఇబ్బందిపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలతో మా కార్యకర్తల ధైర్యాన్ని తగ్గించగలం, భయపెట్టగలం అని ప్రభుత్వం భావిస్తే అది సాధ్యం కాదు అని గుర్తించాలి. తప్పకుండా ప్రభుత్వ అనైతిక చర్యలను, అప్రజాస్వామిక విధానాలను మీడియా, సోషల్ మీడియా ద్వారా మా పార్టీ ప్రశ్నిస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ముందుగా వైసీపీ వాళ్ళను జైళ్లకు పంపాలి
సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పై కేసులుపెట్టి అరెస్టులు చేయాలంటే ముందుగా వైసీపీ పార్టీవాళ్ళనే జైళ్లకు పంపించాల్సి ఉంటుంది. వ్యవస్థలపైనా, వ్యక్తులపైనా ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న దుష్ప్రచారం ఆ పార్టీ పైశాచికత్వాన్ని తెలుపుతున్నాయి. గౌరవ హైకోర్టు, గౌరవ న్యాయమూర్తులపై వారు చేసిన సోషల్ మీడియా పోస్టింగులు వైసీపీ ఆలోచనా విధానాన్ని తెలుపుతాయి. ఆ విధమైన దుష్ప్రచారం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా ఇప్పటి వరకూ పోలీసు శాఖ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. అంటే ఆ శాఖను పాలకులు ఎలా గుప్పిట పెట్టుకొని ఆడిస్తున్నారో అర్థం అవుతుంది. దేవాలయాలపై దాడుల కేసును మరుగునపరచి రాజకీయం చేసేందుకే జనసేన శ్రేణులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. తక్షణమే జనసేన కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.