Janata Curfew: జనతా కర్ఫ్యూ.. ఆదివారం ఏపీలో బస్సులు రద్దు, డిపోల్లోనే 11 వేల సర్వీసులు..
జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో బస్సులను ఆదివారం ఒక్కరోజు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ ప్రబలుండటంతో 22వ తేదీ ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని కోరడంతో.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఆదివారం దాదాపు 11 వేల బస్సు సర్వీసులు డిపోలకే పరిమితం కానున్నాయి.
దూరప్రాంతాలకు సంబంధించి బస్సు సర్వీసులను ఈ రోజు రాత్రి నుంచి నిలిపివేస్తున్నామని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. జనతా కర్ప్యూ, కరోనా వైరస్ సమూలంగా నివారించేందుకే నిర్ణయం తీసుకున్నామని.. ప్రజలు సహకరించాలని కోరారు. ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు కూడా సహకరించి.. బస్సు సర్వీసులను నిలిపివేయాలని కోరారు.
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. విజయవాడకు ప్రయాణికుల రద్దీ తగ్గింది. విజయవాడ-హైదరాబాద్ పలు సర్వీసులను ఆర్టీసీ అధికారులు క్యాన్సిల్ చేశారు. హైదరాబాద్ 50, చెన్నై, బెంగళూరు 20 సర్వీసుల చొప్పున రద్దు చేశారు. ఆదివారానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కూడా రద్దు చేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.