రాజకీయాలు లేవు: హరీష్ రావుతో భేటీపై జయప్రద
తిరుపతి: తాను ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని అలనాటి అందాల తార, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద చెప్పారు. ఈ మధ్యనే ఎన్నికలు జరిగాయి కదా, తాను నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉందని ఆమె అన్నారు. ఎన్నికలపై మాట్లాడడానికి ఇంకా సమయం ఉందని ఆమె అన్నారు. ఆదివారం ఉదయం ఆమె తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఆలయం వెలుపల ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నూతన సంవత్సరం ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామిని ప్రార్థించానని చెప్పారు. తాను తెలంగాణ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపారు. హరీష్ రావుతో భేటీలో ఏ విధమైన రాజకీయం లేదని చెప్పారు. హరీష్ రావు తనకు సోదరుడిలాంటివాడని ఆమె అన్నారు.
తెలంగాణ మంత్రి హరీష్రావుతో సినీనటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద శుక్రవారం ఉదయం మినిస్టర్ క్వార్టర్స్లో కలుసుకున్నారు. కేవలం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపాడానికే జయప్రద కలిశారని హరీష్రావు ధృవీకరించారు. అయితే సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇప్పించాల్సిందిగా జయప్రద కోరినట్లు సమాచారం. చలన చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మంత్రి హరీష్రావును జయప్రద కలిసినట్లు తెలుస్తోంది.
కెసిఆర్తో కలిసి సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలను వివరించాలనే ఉద్దేశంతో జయప్రద ఉన్నట్లు సమాచారం. అయితే, ఆమె రాజకీయాల్లో కూడా చురుగ్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి రాజకీయపరమైన వ్యవహారమేదైనా ఆమె భేటీ వెనక ఉందా అనే సందేహం కూడా వ్యక్తమైంది.
రాజకీయాల్లోకి ప్రవేశించిన మొదట్లో జయప్రద తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో విభేదాలు వచ్చి ఆమె ఆ పార్టీ నుంచి తప్పుకున్నారు. అమర్ సింగ్కు సన్నిహితురాలైన ఆమె ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ తరఫున ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి పోటీ చేసి లోకసభకు ఎన్నికయ్యారు. అయితే, గత ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. రాష్ట్ర విభజనకు ముందు ఆమె తెలుగు రాజకీయాల్లో ప్రవేశించి రాజమండ్రి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనబరిచారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమెకు ఆ అవకాశం రాలేదు.