నేను ఎక్కడున్నా తెలుగు బిడ్డనే: జయప్రద, సెల్ఫీల కోసం పోటీ
హైదరాబాద్: తాను ఎక్కడున్నా తెలుగు బిడ్డనే అని సినీ నటి, సమాజ్వాదీ పార్టీ నాయకురాలు జయప్రద అన్నారు. ఉత్తర్ప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలి డిప్యూటీ చైర్ పర్సన్గా నియమితులైన తర్వాత ఆమె తొలిసారిగా శుక్రవారం సాయంత్రం హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు.
ఆమెకు అభిమానులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తనను ఉత్తర్ప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి మండలి డిప్యూటీ చైర్పర్సన్ గానియమించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ములాయంసింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్కు కృతజ్ఙతలు తెలిపారు.
సాహితీవేత్త నీరజ్ను చైర్మన్గా నియమించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను పూర్తిస్థాయిలో తోడ్పడతానని చెప్పారు. బొంబాయి, హాలీవుడ్ మాదిరిగా యూపీ సినీ పరిశ్రమను తీర్చిదిద్దుతానని చెప్పారు.
తెలుగు, తమిళ సినీ అభిమానులు తనను ఎంతో కాలంగా ఆదరిస్తున్నారని, టాలీవుడ్, కోలీవుడ్ అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషిచేస్తానని జయప్రద తెలిపారు. ఆమెను అభిమానులు పూలమాలలు శాలువాలతో సన్మానించారు.