జయ మృతి-సీఎంగా పన్నీరు: శశికళ వ్యూహం, వెంకయ్య చక్రం తిప్పారా?
చెన్నై: జయలలిత మృతి అనంతరం తెలుగువాడైన కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు చక్రం తిప్పారా? ఆయన చర్చల ఫలితంగానే ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేయగలిగారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది.
సోమవారం జయలలిత మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తమిళనాడులో వేగంగా రాజకీయ పరిణామాలు మారిన విషయం తెలిసిందే. జయ మృతి నేపథ్యంలో పన్నీరు సెల్వంతో పాటు పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి.
అనూహ్యంగా పరిణామాలు
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తొలుత సమావేశమయ్యారు. ఆ భేటీలో పన్నీరు సెల్వంను పలువురు అంగీకరించలేదు. దీంతో ఆ రోజు రాత్రి లేదా మరుసటి రోజు ఉదయం ఎమ్మెల్యేలు భేటీ అయి ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆ రోజు అర్దరాత్రి పన్నీరు సెల్వం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
పన్నీరు సెల్వంకు నో చెప్పినా..
పన్నీరు సెల్వం వద్దని పలువురు పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినా, మరికొందరు ప్రముఖంగా రేసులో ఉన్నా.. చివరకు ఆయనే సీఎం కావడం వెనుక బీజేపీ చక్రం తిప్పినట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ సూచనల మేరకు హుటాహుటిన వచ్చిన వెంకయ్య చక్రం తిప్పి ఉంటారని అంటున్నారు.
వెంకయ్య చక్రం తిప్పారా? అలా పన్నీరు సెల్వం
జయలలిత సోమవారం సాయంత్రమే కన్నుమూసినా అధికారికంగా ప్రకటించకుండా చేశారని, వెంకయ్య చెన్నైకు వచ్చి.. శశికళ - పన్నీరు సెల్వంలతో మాట్లాడి, అందరి మధ్య రాజీ కుదిర్చి వ్యూహం అమలు చేశారనే ప్రచారం సాగుతోంది. ఆ తర్వాతే పన్నీరును శాసన సభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారని అంటున్నారు.
పార్టీ బాధ్యతలు శశికళకు
పార్టీ బాధ్యతలను జయలలిత నెచ్చెలి శశికళకు అప్పగించాలని ప్రాథమికంగా నిర్ణయించారని తెలుస్తోంది. పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకొని, ప్రభుత్వాన్ని తన కనుసన్నుల్లో నడిపించే ఆలోచనతోనే శశికళ బీజేపీ ప్రతిపాదనకు అంగీకరించినట్లుగా తెలుస్తోందని అంటున్నారు. పార్టీలో ఆమె చక్రం తిప్పనున్నారని అంటున్నారు.
ప్రధాని మోడీ వద్ద కన్నీరు
ప్రధాని మోడీ నివాళులు అర్పించేందుకు వచ్చినప్పుడు శశికళ, పన్నీరు సెల్వంలు కంటతడి పెట్టారు. మోడీ.. పన్నీరు భుజం తట్టి, శశికళను ఓదార్చారు. మరోవైపు, అన్నాడీఎంకేలోని పరిణామాలను ప్రతిపక్ష డీఎంకే నిశితంగా పరిశీలిస్తోంది.
పార్టీలో చీలిక ఖాయమా?
అన్నాడీఎంకే పార్టీ ఒక్కటిగా ఉండడం ఇక కష్టమనీ, చీలిక అనివార్యమని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రమణ్య స్వామి ఇప్పటికే చెప్పారు. దివంగత జయలలితకు సన్నిహితురాలైన శశికళ నటరాజన్ ఆ పార్టీ పగ్గాలను స్వీకరిస్తారనీ, పన్నీరు సెల్వాన్ని స్వేచ్ఛగా పని చేయనీయరనీ జోస్యం చెప్పారు. చివరకు ఆమె తమ కుటుంబం నుంచే ఒకరిని సీఎంని చేస్తారని అంచనావేశారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం.. అభివృద్ధితో పాటు హిందుత్వనూ కలపడం తప్పనిసరి అన్నారు. సుబ్రహ్మణ్య స్వామి.. శశికళకు వ్యతిరేకంగా మాట్లాడినా.. బీజేపీ జోక్యం నేపథ్యంలో పార్టీలో చీలిక వస్తుందా అనే చర్చ సాగుతోంది.