ఏపీకి మొండిచేయి: హోదాపై తేల్చిసిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రక్రియలో మార్పులు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు.ఏపీకి ప్రత్యేక హోదాపై అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు జయంత్ సిన్హా స్పందించారు. ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రక్రియలో మార్పులు చేసే ప్రతిపాదన లేదని కేంద్రమంత్రి జయంత్ సిన్హా స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదని తెలిపారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రమంత్రి సిన్హా తేల్చి చెప్పారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి అవసరమైన మేరకు ప్రత్యేక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
నీతిఆయోగ్ సిఫార్సులకు అనుగుణంగా ఏపీకి నిధులు మంజూరు చేస్తామన్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2014-15లో 4,403 కోట్లు, 2015-16లో రూ.2వేల కోట్లు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు.
ద్రవ్యలోటు భర్తీ కింద రూ.2,803 కోట్లు, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.700కోట్లు, రాజధాని నిర్మాణం కోసం రూ.2,050 కోట్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.850 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
బడ్జెట్లో అందుబాటులో ఉన్న నిధుల మేరకు ఏపీకి నిధుల కేటాయింపులు జరుగుతాయని జయంత్ సిన్హా పేర్కొన్నారు. ఇంతకుముందు కూడా పార్లమెంటులోనే మరో కేంద్రమంత్రి చౌదరి ప్రత్యేక హోదాపై ఇదేవిధంగా స్పందించిన విషయం తెలిసిందే. ఆయన కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే అవకాశాలు లేనట్లేనని తెలుస్తోంది.