గొడ్డలితో నరికినట్లు: విభజనపై జెపి, రాష్ట్రపతి పాలనే బెస్ట్
హైదరాబాద్: రాష్ట్ర విభజన తీరు చాలా దారుణమని, ఫ్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలనే ఉత్తమమని లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్ పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ బుధవారం అన్నారు. విభజన తర్వాత పదేళ్ల పాటు ఆదాయలోటును కేంద్రమే భర్తీ చేయాలన్నారు. హైదరాబాదులో శాంతిభద్రతల అంశాన్ని రాజ్యాంగ సవరణ చేసి గవర్నర్కు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం మెజార్టీ సభ్యుల మద్దతుతో కూడిన ప్రభుత్వం ఏర్పడటం కష్టమన్నారు.
తెలుగు ప్రజల భవిష్యత్, భావోద్వేగాలతో ముడిపడిన రాష్ట్ర విభజనను కేంద్రం నిపుణుడైన వైద్యునిలా శస్త్ర చికిత్సలా చేయాల్సి ఉండగా గండ్ర గొడ్డలితో నరికినట్టు చేసిందని అన్నారు. విభజన చేసిన తీరు సీమాంధ్ర ప్రజలను గుండెకోత కోసిందన్నారు. విభజన సమయంలో సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తామని కాంగ్రెస్, బిజెపి ఇచ్చిన హమీలను నెరవేర్చలేదని విమర్శించారు.
విభజన కారణంగా సీమాంధ్ర ప్రాంతానికి ఏర్పడనున్న రెవెన్యూలోటును కేంద్రం భరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏటా 10 వేల కోట్లు చొప్పున ఏర్పడనున్న రెవెన్యూ లోటును పదేళ్లపాటు భరించాలని అన్నారు. లేకపోతే ఆ ప్రాంతంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. లోక్సత్తా చేసిన సవరణలు ఆమోదయోగ్యమైనవని చెబుతూనే మూడింటిని మాత్రమే కేంద్రం ఆమోదించడం సరికాదన్నారు.
తాము చేసిన సవరణలనే యథాతథంగా ప్రతిపాదించిన బిజెపి వాటి కోసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రత్యేక ప్రతిపత్తిగల రాష్ట్రాలకు ఇస్తున్న విధంగా ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సీమాంధ్రలో రెండు రాజధానులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. అభివృద్ధిని కూడా వికేంద్రీకరించాలన్నారు.
పదేళ్లలోపే ఎంత సాధ్యమైతే అంతత్వరగా సీమాంధ్రలో రాజధానితోపాటు మౌలిక సదుపాయాలను కేంద్రం అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్పై గవర్నర్కు అధికారం అప్పగించడం రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. మీడియా కూడా రాజకీయాలను వన్డే, టి-20 క్రికెట్ మ్యాచ్లా ఉత్కంఠంగా మార్చేయడం సరికాదన్నారు.