తప్పుడు బిల్లును పెడతారా?, దుష్ప్రచారమే: జెపి
హైదరాబాద్: కేంద్ర కేబినెట్ ఆమోదించిన తప్పుడు బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడం సరికాదని లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్నారాయణ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం దేశానికి మంచిది కాదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము సూచించిన ఏడు ప్రతిపాదనల్లో.. రాష్ట్ర విభజన బిల్లులో రెండు మాత్రమే చేర్చారని ఆయన తెలిపారు.
పోలవరం ముంపు ప్రాంత గ్రామాలను సీమాంధ్రలోనే ఉంచడాన్ని పెద్ద ఘనకార్యంగా చెప్పుకోవడం సరికాదని జయప్రకాష్ అన్నారు. తాము చూపించిన మౌలిక ప్రతిపాదనలకు రిక్త హస్తం చూపించారని జెపి ఆరోపించారు. కేంద్రం అన్నింటికీ మాటలతోనే సరిపెడుతోందే తప్ప.. చేతల్లో శూన్యమని జెపి అన్నారు.
పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలని సూచించింది తామే అని జెపి తెలిపారు. ఇరు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల భవితవ్యంపై స్పష్టత ఇవ్వాలని జెపి డిమాండ్ చేశారు. భద్రాచలం ప్రజలు తెలంగాణలోనే ఉండాలని కోరుకుంటున్నారని కాబట్టీ తెలంగాణలో ఉంచడం సబబే కానీ, అనంతపురం, కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణలో ఉంటామని చెప్పినా ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో 4వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామనడం సంతోషకరమని వ్యాఖ్యానించిన జెపి, వెనుకబడిన ప్రాంతాలకు పన్ను రాయితీలు ఇవ్వాలనే నిర్దిష్ట ప్రతిపాదన బిల్లులో లేదన్నారు. తాము సూచించిన అన్ని ప్రతిపాదనలను అమలు చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారే తప్ప, అమలు చేయడం లేదనీ జెపి మండిపడ్డారు.