జగన్ పాలనపై జయప్రకాశ్ నారాయణ్ .. ఇది జమిందారీ వ్యవస్థ కాదన్న జేపీ
లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకపక్క నెలరోజులే కదా ఇంకా ఏమీ అప్పుడే చెప్పలేం అంటూనే జగన్ పాలన జమిందారీ పాలనలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్మాణంతో కాకుండా విధ్వంసంతో పాలన స్టార్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మాటిచ్చాను కాబట్టి మాట కోసం ఏదైనా చేస్తా అంటే అది పాలన కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వం ప్రజా వేదికను కూల్చివేయాలని తీసుకున్న నిర్ణయం కూడా తప్పే అని ఆయన పేర్కొన్నారు.
ప్రజా ధనం దుర్వినియోగం చెయ్యటానికి, మాటిస్తే చేస్తా అనటానికి ఇది ఫ్యూడల్ వ్యవస్థ కాదన్న జేపీ
ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన జగన్ సర్కార్ పాలనా తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు . జయప్రకాశ్ నారాయణ్ ప్రజాధనాన్ని పొదుపుగా వాడటం పాలక ప్రభుత్వాలకు అవసరమని పేర్కొన్నారు. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలి అంటే ఏ తరహా ప్రణాళికలతో ముందుకు వెళ్తుందో ఆ తరహా ప్రణాళికలు ప్రభుత్వానికి సైతం వుండాలన్నారు. పూర్వకాలం జమిందారుల వ్యవస్థలా , రాచరికంలా, నిజాముల పాలనలా అప్పటికప్పుడు తోచింది చేస్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని జయప్రకాశ్ నారాయణ్ విమర్శించారు . మాటిచ్చాను కాబట్టి తప్పక చేస్తాను అని చెప్పి ఆచరణ సాధ్యం కానివి ప్రజలకు ఇస్తానని చెప్పటం అభివృద్ధిని నాశనం చేస్తుంది. మాట ఎన్నికల్లో ఇచ్చి ఉండొచ్చు కానీ అధికారంలోకి వచ్చాక అయినా రాజ్యాంగాన్ని,రాష్ట్రాన్ని రక్షించేలా నిర్ణయం తీసుకోవాలి కానీ ఇది రాచరికమో, ఫ్యూడల్ రాజ్యమో కాదని ఆయన జగన్ పాలనపై వ్యాఖ్యలు చేశారు.
ఏ ప్రభుత్వానికైనా మొదటి ప్రాధాన్యత విధ్వంసం కాకూడదు అన్న జేపీ
మొన్నటికి మొన్న ప్రజా వేదిక కూల్చివేత గురించి మాట్లాడుతూ తెల్ల వాళ్ళు కట్టారని పార్లమెంట్ భవనాన్ని నాటి ప్రభుత్వాలు కూల్చేయలేదని జేపీ అన్నారు. వలస రాజ్యానికి ప్రతీకలు అయినప్పటికీ ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దన్న కారణంతోనే వాటి కూల్చివేతకు పాల్పడలేదని ఆయన పేర్కొన్నారు. ఏ పని చేసినా మొదటి ప్రయారిటీ విధ్వంసం కాకూడదు అని ఆయన స్పష్టం చేశారు. అందులోనూ ప్రజా ధనంతో కట్టిన కట్టడాల విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీవ్రమైన కారణాలు అయితేనే ఈ తరహా నిర్ణయం తీసుకోవాలని, పుర్రెకు బుద్ధి పుట్టిందని ఏది పడితే అది చేస్తే సమంజసం కాదని జేపీ పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికలలో విజయం సాధించడానికి ఓటర్లను వివిధ మార్గాల ద్వారా ప్రలోభ పెట్టారని జేపీ పేర్కొన్నారు . జగన్ ప్రభుత్వ పాలన భూస్వామ్య వ్యవస్థను తలపిస్తుందని జయప్రకాష్ పేర్కొన్నారు.
ప్రభుత్వాలే మారుతున్నాయి పాలన కాదన్న జయప్రకాష్ నారాయణ్
ప్రభుత్వాలు మారినా పాలన మారటం లేదని, తాయిలాలు ఇస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే పార్టీలే పాలన సాగిస్తున్నాయని జేపీ అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడ చూసినా పాలకులు మారుతున్నారు కానీ పాలన మారటం లేదని ఆయన తెలిపారు. గత పాలకుల మీద ప్రస్తుత పాలకుల దాడి పదేపదే కొనసాగుతుందని చెప్తున్న జేపీ ప్రజలకు అందరికీ విద్య, ఆరోగ్యం అందించి రాజ్యాంగాన్ని రక్షించేలా , రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా పాలకులు పని చెయ్యాలని జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు.