చంద్రబాబు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు: జేపీ
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల మధ్య విద్వేషాలను లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ(జేపీ) ఆరోపించారు. ఇలా చేయడం వల్ల ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్లకు ఏమీ కాదని, నష్టపోయేది సామాన్య ప్రజలేనని అన్నారు.
శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం ప్రాంతాల మధ్య సమస్య కాదని ఆయన పేర్కొన్నారు. రెండు ప్రభుత్వాలు, ఇద్దరు సీఎంలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ, నువ్వు ఒకటి చేస్తే, నేను రెండు చేస్తా అన్నట్టుగా ముందుకు సాగుతున్నారని అన్నారు.
ఈ వివాదాలను కేంద్రం పరిష్కరించుకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని జేపీ మండిపడ్డారు. రాజకీయ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా ఇరు ప్రాంతాల్లోని ప్రజలు పూర్తి సామరస్యంతో ఉన్నారని తెలిపారు.
మరికొంత మంది ప్రజల మధ్యన పౌరయుద్ధం, హింస రావాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. అయితే ప్రజల్లో విజ్ఞత ఉందని, దాన్ని పోగొట్టాలని చూస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతక ముందు ఓటుకు నోటు, ఫోన్ట్యాపింగ్ వ్యవహారాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
ఈ కేసులను సీబీఐకి అప్పగించి, వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్నాథ్సింగ్, గవర్నర్ నరసింహన్లకు శుక్రవారం ఆయన లేఖలు రాశారు. ఈ వివాదాలు తెలుగు ప్రజలమధ్య తీవ్ర మనస్పర్థల కు దారితీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.