హోదా అడిగితే దేశద్రోహమా? నాన్సెన్స్!, జగన్ను అడ్డుకోవడమేంటి?: జేపీ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఘాటుగా స్పందించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఘాటుగా స్పందించారు. హోదా విషయంలో అలసత్వం వహిస్తున్నాయంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలు మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తామని ఆరు నెలల కిత్రం వరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఇతర కేంద్ర మంత్రులు చెప్పిన మాటలనే ఇప్పుడు రాష్ట్రంలో యువత, ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేయడానికి పూనుకుంటే అది దేశద్రోహ చర్య ఎలా అవుతుందని జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. పాలకుల్లో ఇలాంటి అసహనం పెరగడం ఆంధ్రప్రదేశ్కు ఏ మాత్రం మంచిది కాదన్నారు.
విశాఖపట్నం ఎయిర్పోర్టులో ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్రెడ్డి పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏమాత్రం ప్రజాస్వామిక చర్య అనిపించుకోబోదన్నారు. తిమ్మిని బమ్మి చేసి ప్రజలను భ్రమింపజేసేందుకు టీడీపీ, బీజేపీ ప్రత్యేక హోదా నిర్వచనాన్ని మార్చి, పారిశ్రామిక రాయితీలు అందులో భాగం కానట్టు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న సహాయానికి ప్యాకేజీ అన్న పేరు పెట్టడాన్ని ఆయన నాన్సెన్స్గా పేర్కొన్నారు. ప్రత్యేక హోదాతో పన్ను రాయితీలు వస్తాయి.. రాయితీలు వస్తే ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమల పెట్టుబడులు గణనీయంగా వచ్చే అవకాశం ఉందన్నారు. హోదా ఉన్న రాష్ట్రాలకే పారిశ్రామిక రాయితీలు దక్కాయని అన్నారు
అధికారంలో ఉన్నవారికి నచ్చినా, నచ్చకపోయినా, ప్రజలు తమ కోరికకు అనుగుణంగా నిరసన తెలిపే హక్కు ఉంటుందని, రాష్ట్రంలో ఫలానాది జరిగితే బాగుండని.. ఎవరూ పట్టించుకోవడం లేదని పది మంది గుమికూడి నిరసన తెలపచ్చని అన్నారు.
'ప్రత్యేక హోదా కోసం అడిగితే అది దేశద్రోహం ఎలా అవుతుంది? ప్రత్యేక హోదా అవసరం లేదనుకుంటే శ్వేతపత్రం ప్రకటించి, పన్ను రాయితీ అవసరం లేదు, ప్యాకేజీ సరిపోతుందని చెప్పమనండి. నిన్నటిదాకా వాళ్లు చేసిన వాదన ఇప్పుడు అన్యాయమైపోయింది, అక్రమమైపోయింది. మాట ఇచ్చారు కాబట్టి అడుగుతున్నారు. ఇది తప్పు ఎలా అవుతుం ది? అడిగేవారి గొంతు నొక్కడం విజ్ఞత కాదు. బలవంతంగా నోరు మూసే ప్రయత్నం చేస్తే ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది కాని తగ్గదు' అని అన్నారు.
'రాష్ట్రానికి కేంద్రం పెద్దలు ఏయే హామీలు ఇచ్చారు. ఏవి జరిగాయి, ఏవి జరగలేదు. ఏం సాధించుకోవాలి. సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం కాదో ప్రభుత్వం శ్వేతప్రతం రూపం లో చెప్పాలి. కానీ ఇదంతా జరగలేదు. ఇది ప్రైవేట్ వ్యవహారం కాదు. ప్రజల ముందు పెట్టాలి. ప్యాకేజీ అంటున్నారు. ఆ పదమే నాన్సెన్స్' అంటూ జయప్రకాశ్ నారాయణ ఘాటుగా స్పందించారు.