నేనేమైనా అంటే బాధపడ్తారు, వారిని తన్నాలనిపిస్తోంది: బడ్జెట్పై జేపీ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ కేంద్ర బడ్జెట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత వారం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డారు.
Recommended Video
బడ్జెట్ గురించి తానేమైనా అంటే సంపన్నులు, ఎగువ మధ్య తరగతి వారు కొందరు బాధపడతారని, అయినా తన అభిప్రాయం మాత్రం బడ్జెట్ బాగుందనేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
పన్ను వసూలు తప్పేం కాదు
స్టాక్ మార్కెట్ కు బడ్జెట్ మేలు చేస్తుందని జేపీ తెలిపారు. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలను తెచ్చుకున్న వారి నుంచి కొంత పన్ను వసూలు చేయడం తప్పేమీ కాదని అన్నారు. తన దృష్టిలో ఇది మంచి పరిణామమని అన్నారు. ఎక్కువకాలం పాటు పెట్టుబడులను కదల్చని వారి నుంచి స్వల్ప మొత్తంలో పన్ను వసూలు చేయడం మంచిదేనని పేర్కొన్నారు. ఇది అధర్మమైన పనేం కాదని అన్నారు.
మూడు ప్రమాణాలు అవసరం
బడ్జెట్ తరువాత ధనికులు, పేదలపై ఎటువంటి సానుకూల ప్రభావం ఉంటుందన్న విషయమై తనదైన శైలిలో విశ్లేషించారు. పాలనలో మూడు ప్రమాణాలు అవసరమని జేపీ అన్నారు. గత ప్రభుత్వాలు చేయాల్సినవి పూర్తి చేయకపోవడంతో చాలా నష్టపోయామని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, చట్టబద్ద పాలన అని ఆయన అన్నారు.
ఆరోగ్య బీమా పెద్ద అడుగే.. కానీ..
పేద ప్రజల ఆరోగ్య బీమా కోసం రూ.5లక్షలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం చాలా మంచి నిర్ణయమని అన్నారు. ఇది ఒక పెద్ద అడుగు అని చెప్పారు. కుటుంబానికి రూ.5లక్షలు అంటే.. 50కోట్ల జనాభాకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. నచ్చిన వైద్యుడిని ఫ్యామిలీ డాక్టర్ గా ఉంచుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించాలన్నారు. ప్రభుత్వ వైద్య శాలల్లో వసతులను మెరుగుపర్చాలని అన్నారు. పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించాలన్నారు.
వ్యవసాయంపై ఇలా చేస్తే
జైట్లీ.. వ్యవసాయం గురించి చాలా మాట్లాడారు కానీ, అంతగా ఏం చేసినట్లు కనిపించలేదని జేపీ అన్నారు. రైతులు పంటకు మద్దతు ధర కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. దళారీ వ్యవస్థ లేకుండా చేస్తేనే రైతుకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఆ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. స్టోరేజీలను ఏర్పాటు చేయాలి.
తెలుగు ప్రజలం కాబట్టి..
చట్టబద్ద పాలన గురించి బడ్జెట్ల్ ఊసేలేదని జేపీ అన్నారు. అయితే, రోడ్లు, విద్యుత్, రైల్వేల మెరుగుదలకు కేంద్రం కృషి చేస్తోందని అన్నారు. తెలుగు ప్రజలం కాబట్టి మనం మన గురించి ప్రస్తావించాలని కోరుకుంటామని అన్నారు. దానిలో తప్పులేదని అన్నారు. అయితే, రాష్ట్రాల వారీగా నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించలేరని అన్నారు. జాతీయ బడ్జెట్ కాబట్టి ప్రతీ రాష్ట్రాన్ని ప్రస్తావించలేరని అన్నారు. కేంద్ర బడ్జెట్లోని 24లక్షల్లో 12లక్షల కోట్లను రాష్ట్రాలకే కేటాయించారని చెప్పారు. కేంద్రం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోందని అన్నారు.
ద్వేషం.. వారిని చూస్తే తన్నాలనిపిస్తోంది
మనకు ఏదో చేయాలని తెలుగు రాష్ట్రాలు కోరుకోవడంలో తప్పులేదని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగుతున్నాయని అన్నారు. ప్రస్తుత రాజకీయాలంటే చాలా ద్వేషం ఏర్పడిందని, స్వార్థ రాజకీయాలు చేసేవారిని తన్నాలని అనిపిస్తోందని జేపీ అన్నారు. ఎమ్మెల్యేలు జీతాలు వారికి వారు పెంచుకోవడం సరికాదన్నారు.