జెసి బ్రదర్స్ మాటలకు చంద్రబాబు జీ హుజూరా...అవునా...నిజమా....
అనంతపురం: జెసి దివాకర్ రెడ్డి..ది రెబల్; జెసి ప్రభాకర్ రెడ్డి ది రెబల్ అండ్ ఆఫ్...మొత్తంగా జేసీ బ్రదర్స్ అంటే ఒక సంచలనం..అనంతపురం జిల్లాలో వీరిదే హవా...ఒకప్పుడు కేరాఫ్ కాంగ్రెస్...కానీ ఇప్పుడు టిడిపిలో...అన్న ఎంపి...తమ్ముడు ఎమ్మెల్యే...ఇదీ వారి స్టేటస్...కానీ స్టేటస్ ఏదైనా అనంతపురం జిల్లాలో వారి మాటే శాసనం.
ఇక ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జెసి బ్రదర్స్ మాటలకు ఇస్తున్నంత ప్రాధాన్యత ఇంతకుముందెప్పడూ లేదంట...అంతేకాదు స్వయంగా టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జేసీ బ్రదర్స్ ల మాటకు జీ హుజూర్ అంటున్న పరిస్థితి కనిపిస్తోందట...ఈమాట ఆ పార్టీ నేతలే చెప్పి వాపోతున్నారు...అవునా...నిజమేనా...ఔనని..ఎలా నిజమో...జెసి బ్రదర్స్ మాటల చెల్లుబాటు ఉదంతాలు కథలు కథలుగా చెప్పి బావురుమంటున్నారట.
ఎల్లప్పుడూ వివాదాలే...
జెసి బ్రదర్స్ అంటేనే సంచలనాలు...వివాదాలు...ఏది మాట్లాడినా కుండబద్దలు కొట్టినట్లు..ఇంకా చెప్పాలంటే మొహం పగిలినట్లు మాట్లాడటం వీరి నైజం..అందుకే ఎన్నోసందర్భాల్లో వీరి మాటలు, చేతలు వివాదమయ్యాయి...కలకలం రేపాయి...సంచలనం సృష్టించాయి. పాత వివాదాల సంగతి పక్కనబెడితే ఇండిగో సిబ్బందిపై దాడి..సారీ చెప్పకుండానే పారిస్ వెళ్లిపోవడం, రెడ్డి కులస్థులపై వ్యాఖ్యలు అన్నఖాతాలో, ఇక తమ్ముడు జెసి ఆ మధ్యన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనంతపురంలోనే ఎన్ని బూతులు తిట్టిందీ అందరూ చూశారు...
ఇటీవలే...అన్న హల్ చల్...
ఇవన్నీఒకెత్తయితే నెల క్రితం ఉన్నట్టుండి జెసి దివాకర్ రెడ్డి నెల క్రితం హెవీ హై డ్రామాకు తెరదీశారు. తాను రాజీనామా చేసేస్తున్నానని ప్రకటించారు. అసలు తన మాటకు విలువ లేకుండా పోతోందని, తన నియోజకవర్గంలోని రైతులకు చుక్క నీరు కూడా దక్కకుండా పోతోందని, అధికార పార్టీకి చెందిన ఎంపీ అయి ఉండి పీకిందేంటని రైతులు నన్ను ప్రశ్నిస్తున్నారని పెద్ద ఎత్తున హంగామా సృష్టించారు. మీడియాను పిలిపించి మరీ దాదాపు రెండు గంటలపాటు హల్చల్ చేశారు. దీంతో హుటాహుటిన స్పందించిన సీఎం చంద్రబాబు ఆఘమేఘాల మీద అనంతపురం జిల్లాలో జేసీ నియోజకవర్గానికి నీరందేలా చూడాలని మంత్రి దేవినేని ఆదేశించారు. దీంతో 24 గంటలు కూడా గడవకముందే అక్కడ నీరు పారింది. దీంతో జేసీ దివాకర్ రెడ్డి తన రాజీనామాను తూచ్ అనేశారు.
ఆ తరువాత తమ్ముడు...
ఆ తరువాత ఆయన తమ్ముడు తాడిపత్రి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్రెడ్డి వంతు వచ్చింది. ఈయన అన్నకంటే మరింత స్ట్రయిట్ ఫర్వార్డ్...అందుకే తన అన్నలా రాజీనామా అస్త్రం లాంటి డ్రామాలేవీ అడ్డుపెట్టుకోకుండా తనదైన శైలిని...తాను ఎప్పుడూ ఉపయోగించే పద్దతినే అనుసరించారు. అవే బూతుల అస్త్రాలు...తన నియోజకవర్గంలో గ్రానైట్ క్వారీలు ఎక్కువగా ఉన్నాయని, వాటికి రాయల్టీ తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, చూస్తాం.. చేస్తాం.. అంటూ నచ్చజెబుతున్నఅధికారులపై ఆయన బూతులతో విరుచుపడ్డారు. ఆ సమయంలో మంత్రులను కూడా వదలకుండా వడ్డించేవారట. దీంతో ఈ విషయం ఈ విషయం సీఎం చంద్రబాబు దాకా వెళ్లింది. అందరూ ఏదో జరుగుతుందనుకున్నారు. కానీ చివరకు జరిగింది జెసి ప్రభాకర్ రెడ్డి మాటే చెల్లుబాటు కావడం.
ఖజానాకు నష్టమైనా సరే...
జెసి ప్రభాకర్ రెడ్డి కోరినట్లుగానే రాయల్టీలో 20 శాతం తగ్గింపునకు చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. నిజానికి రాయల్టీ తగ్గింపు వల్ల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు రాబడి తగ్గిపోతుంది. అయినా కూడా ప్రభాకర్ రెడ్డి టంగ్ పవర్కి బాబు పవర్ ఓకే అనక తప్పలేదనే ప్రచారం జరిగింది.
మున్సిపాలిటీ మాటల యుద్ధం...
అనంతపురం కార్పొరేషన్ పరిధిలో వివిధ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ విషయంలో, రోడ్లు, డివైడర్ల నిర్మాణం విషయంలో ఎంపీ దివాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి- మేయర్ స్వరూపలకు కొన్నాళ్లుగా మాటల యుద్ధం సాగుతోంది. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప, మున్సిపల్ అధికారులు కుమ్మౖక్కె అనంతపురం నగరపాలక సంస్థను నాశనం చేశారని ఎంపీ జేసీ దివాకర్రెడ్డి గతంలో విమర్శించారు. తమపై ఎంపీ చేసిన వివిధ విమర్శలపై మేయర్ స్పందించారు. దివాకర్ రెడ్డిని రాక్షసుడుగా అభివర్ణించారు.దివాకర్ రెడ్డికి నల్లకళ్లద్దాలు పెట్టుకుంటారని, అందుకే ఆయన కళ్లకు అభివృద్ధి కనపడదు అని ఆమె వ్యాఖ్యానించారు. వంద కోట్ల రూపాయలతో తాము అభివృద్ధి పనులు చేసినా దివాకర్ రెడ్డికి అవి కనిపించవని, ఆయన నల్ల కళ్లద్దాలను తెల్ల అద్దాలు పెట్టుకోవాలని సూచించారు. అప్పుడు అభివృద్ధి కనిపిస్తుందన్నారు. జేసీ అనంతపురం టౌన్ కు చుట్టపు చూపుగా మూడు నెలలకు ఒకసారి వస్తారని, అనంత అభివృద్ధికి ఇంత వరకూ ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన చరిత్ర ఆయనకు ఉందా? అని ఆమె ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నది జేసీనే అని ఆమె తిప్పికొట్టారు.
తాజాగా మరోసారి...
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై నగర మేయర్ స్వరూప నిన్న తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు శివనాయుడు ఫోన్ చేసి ఎమ్మెల్యే, మేయర్ను బెదిరించారు. ఈ మేరకు స్వరూప,ప్రభాకర్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు శివ నాయుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలియగానే ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. 'నా అనుచరుడ్ని అరెస్ట్ చేస్తారా' అంటూ ఆగ్రహావేశాలతో పోలీస్ స్టేషన్లో వీరంగం సృష్టించారట.
ఇదీ జెసిల పరిస్థితి...
ఇదండీ జేసీల పరిస్థితి. మరి ఇంత చేసినా చంద్రబాబు జెసి బ్రదర్స్ ను ఎందుకు ఉపేక్షిస్తున్నారో ఆ పార్టీ నేతలకు మిలియన్ డాలర్ల ప్రశ్నలా ఉందట. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ చంద్రబాబు తరుచూ అంటూంటారు. మరి జెసి కుటుంబం వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నా చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అనే ప్రశ్నఅందరిలో మెదులుతోందట. పైగా పనుల విషయాల్లోనూ జెసి బ్రదర్స్ మాటలే చెల్లుబాటు కావడం టిడిపి నేతలను కలవలపరుస్తోంది. వారిలా బెరిస్తే కానీ ఆ నియోజకవర్గాల నేతలే కాదు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా చర్చించుకుంటున్నారట.
కారణం ఇదేనా...
రాజకీయ కారణాల వల్ల జెసి సోదరులంటే చంద్రబాబు భయపడుతున్నారా? అంటే, అవుననే సమాధానపరుచుకుంటాన్నారు ఆ పార్టీ నేతలు. ఎందుకంటే, బైట వారిగురించి ఏమనుకున్నాఅనంతపురం జిల్లాలో ఇప్పటికీ జెసి సోదరుల ప్రభావం బాగుంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాయలసీమ నేతలవ్వటమే వీరికి బాగా కలిసి వస్తోంది. పైగా తాడిపత్రిలో వీరికి బలమైన మద్దతుదారులున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తే తప్ప వీరిని ఎవ్వరూ ఓడించలేని పరిస్థితి. అందుకే తాడిపత్రిలో వరుసగా సునాయాసంగా గెలిచేస్తున్నారు. సో...అంత బలమైన క్యాడర్ ఉన్న జెసి సోదరులపై క్రమశిక్షణ చర్యలంటే మామూలు విషయం కాదు. ఒకవేళ చర్యలు తీసుకోవాలనుకుంటే వీరి రియాక్షన్ ఎలాగుంటుందో చంద్రబాబుకు బాగా తెలుసు. వీరు టిడిపిని వద్దనుకుంటే వెంటనే భారతీయ జనతా పార్టీలోకో లేక వైసీపీలోకో వెళ్ళిపోగలరు. అందుకనే జెసి బ్రదర్స్ ఎన్ని వివాదాల్లో ఇరుక్కుంటున్నా చంద్రబాబు పట్టనట్లు వదిలేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ కొసమెరుపంటే...
అయితే విచిత్రమేమిటంటే రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో జెసి బ్రదర్స్ ఇద్దరూ ఎన్నికల్లో పోటీ చెయ్యరట. జెసి దివాకర్ రెడ్డి రాజకీయాలనుంచి విరమించుకోవాలని అనుకుంటుంటే, జెసి ప్రభాకర్ రెడ్డి తన ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటారట. కాకపోతే వారి ప్లేసుల్లో వారి వారసులు రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారట. ఇదీ కొసమెరుపు...