‘జేసీ బ్రదర్స్’ తీరే వేరు! సొంత పార్టీ నేతలైనా సరే, వ్యతిరేకిస్తే అంతే!
అనంతపురం: కొందరు నాయకుల తీరు విభిన్నంగా ఉంటుంది. వారి పేరు ప్రజల నోళ్లలో నిత్యం నానుతుంటుంది. అది మంచైనా కావచ్చు. చెడైనా కావచ్చు- ఏదో ఒక రకంగా పత్రికల్లో, మీడియాలో పతాక శీర్షికల్లో కనిపిస్తూ ఉంటారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన జేసీ సోదరులే ఇందుకు ఉదాహరణ!
కాంగ్రెస్పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు తెలుగుదేశం పార్టీపై జేసీ సోదరులు పెద్ద యుద్ధమే చేసేవారు. అలాంటి నేతలు రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. ఎంపీగా దివాకర్రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి గెలిచారు. అనంతరం సొంత పార్టీ నేతలతోనే తగవులాడుతూ ప్రస్తుతం అందరి దృష్టినీ తమవైపు తిప్పుకుంటున్నారు.
పార్టీలోనే వ్యతిరేకులపై దృష్టి...
అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అధికార పార్టీలోనే తమను వ్యతిరేకించే వారిపై జేసీ సోదరులు దృష్టి సారించారు. నిత్యం ఆయా నేతలను టార్గెట్ చేయడం ద్వారా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటారని రాజకీయవర్గాల్లో టాక్ నడుస్తోంది.
సొంత పార్టీ నాయకులపైనే సంచలన వ్యాఖ్యలు...
ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఇటీవల అనంతపురానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సంచలనాత్మక వ్యాఖ్యలుచేశారు. మరువంక విస్తరణ, ఆధునీకరణ పనుల విషయంలో కొన్ని దయ్యాలు, భూతాలు అడ్డుపడుతున్నాయని అన్నారు. జేసీ చేసిన ఈ వ్యాఖ్యలతో టీడీపీ వర్గాలు విస్తుపోయాయి. దీనిపై మేయర్ స్వరూప స్పందించి ఎంపీ తీరును ఖండించారు. ఈ తరుణంలో కొన్నాళ్లుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో జేసీ పేరు బాగా నలుగుతోంది.
ఆయన ఢిల్లీ వెళ్లినా...
సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి ఢిల్లీ వెళ్లిపోయారు. కానీ అనంతలో మాత్రం ఆ వేడి ఇంకా చల్లారలేదు. ఈ నేపథ్యంలో ఎంపీ జేసీ అనుచరుడు మడ్డిపల్లి శివనాయుడు పేరు తెరపైకి వచ్చింది. ‘మా నాయకుడు జేసీపై నోటికొచ్చినట్లు మాట్లాడుతారా?'' అంటూ స్థానిక ఎమ్మెల్యేని, మేయర్ని ఆయన ఫోన్లో దుర్భాషలాడారట. దీనిపై పోలీసులకు ఫిర్యాదుచేయడంతో అనంత త్రీటౌన్ పోలీసులు శివనాయుడిని స్టేషన్కి తీసుకొచ్చారు.
ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి జోక్యం...
ఈ సమయంలో తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి పోలీసులపై నిప్పులు చెరిగారు. వెంటనే తమ అనుచరుణ్ని విడిపించుకువెళ్లారు. ఈ వివాదంతో అటు పోలీసులకు, ఇటు అధికారపార్టీ నేతలకు తలలు బొప్పికట్టాయి. తాడిపత్రిలో పోలీసు స్టేషన్కి వెళ్లిన ఎమ్మెల్యే అనుచరులు అక్కడ ధర్నాచేశారు. గలాటా సృష్టించారు. ఎమ్మెల్యే రంగప్రవేశం చేసి తమ అనుచరుణ్ని విడిపించుకు వెళ్లడం ఈ మొత్తం ఘటనలో కొసమెరుపు.
జేసీ బ్రదర్స్ వైఖరి సరికాదు: రఘువీరారెడ్డి
మరోవైపు అనంతపురం టీడీపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా స్పందించారు. టీడీపీలో సాగుతున్న వర్గవిభేదాలతో తమకు సంబంధం లేదనీ, అయితే బాధ్యత కలిగిన ఎమ్మెల్యే పోలీసులపై విరుచుకుపడటం మాత్రం సరైంది కాదనీ ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో ఇలాంటి పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగా నియంత్రించాలని రఘువీరా డిమాండ్ చేశారు.
వైసీపీ, కమ్యూనిస్టు పార్టీల నేతల ఆందోళన...
తాడిపత్రిలో చోటుచేసుకున్న తాజా ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ వైసీపీ, కమ్యూనిస్టు పార్టీల నేతలు జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టాయి. ఏదిఏమైనా ఒక్కటి మాత్రం నిజం. అనంత రాజకీయాల్లో ప్రస్తుతం జేసే సోదరులే హాట్ టాపిక్గా ఉన్నారు. జరుగుతున్న పరిణామాలపై టీడీపీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి మరి!