మరో వివాదంలో జేసీ బ్రదర్స్ : పోలీసుల సంతకాలు ఫోర్జురీ.. ఆరు లారీలు కొనుగోలు
తాడిపత్రి: కాంట్రవర్శీస్కు కేరాఫ్గా నిలిచే జేసీ బ్రదర్స్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. లారీల కొనుగోలు చేసేందుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే లారీల విక్రయాల కోసం తాడిపత్రి ఎస్ఐ సంతకాలు ఫోర్జరీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. తాడిపత్రిలోని జేసీ ట్రావెల్స్ కార్యాలయంలో దీనికి సంబంధించిన ఫోర్జురీ డాక్యుమెంట్లను కూడా గుర్తించారు పోలీసులు. నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి బెంగళూరులో ఆరు లారీలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు జేసీ ట్రావెల్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించగా అధికారుల నకిలీ సీళ్లు బయటపడ్డాయి. ప్రస్తుతం రామ్మూర్తి ఇమాం అనే ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు.
దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం సూచనల మేరకే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు తమవద్ద సమాచారం ఉందని చెప్పారు డీఎస్పీ శ్రీనివాస్. నిందితుల వెనక ఎవరున్నారనే దానిపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించినట్లు డీఎస్పీ చెప్పారు. అంతేకాదు ఈ ఆరు లారీలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయితే సంతకాలు మాత్రం ఫోర్జరీ జరిగాయని చెప్పారు డీఎస్పీ. ఇక కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పట్టుకోగా మరో ఇద్దరు పరారీలో ఉ్ననారు. వీరి వద్ద నుంచి ల్యాప్టాప్లు సెల్ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఎన్ఓసీలను యాజమాన్యం సూచనల మేరకే సృష్టించినట్లు పట్టుబడ్డ ఇద్దరు నిందితులు ఒప్పుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ చెప్పారు. ఆరు లారీలకు సంబంధించి విక్రయాలు చేసిన సందర్భంలో పలు డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాదు ఎన్ఓసీ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఎన్ఓసీని స్థానిక పోలీసులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పోలీసులు మాత్రం అలాంటి ఎన్ఓసీ ఇవ్వలేదు. నిందితులే ఎన్ఓసీని తయారు చేసి తాడిపత్రి ఎస్ఐ సంతకంను ఫోర్జురీ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ చెప్పారు. మిగతా ఇద్దరి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇప్పటికే జేసీ ట్రావెల్స్ అధీనంలో నడుస్తున్న బస్సులపై ఏపీ ప్రభుత్వం చర్యలకు దిగుతుండగా తాజా వివాదం జేసీ బ్రదర్స్కు మరో షాక్ ఇచ్చినట్లయ్యింది. దీనిపై జేసీ బ్రదర్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.