నేనే చంద్రబాబుతో మాట్లాడుతా: హరిబాబుకు జేసీ, 'కలిసిన టీడీపీ-కాంగ్రెస్ జెండాలు.. ఆశ్చర్యం'
విశాఖ: ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీతో ఆదుకునేందుకు కేంద్రం సానుకూలంగానే ఉందని, రాష్ట్రానికి రూ.19వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోమవారం కౌంటర్ ఇచ్చారు. హరిబాబు వ్యాఖ్యలు అవాస్తవం అన్నారు.
'పవన్తో... మోడీ గురించి సింగపూర్లోనే కాదు, బాబు అన్ని దేశాల్లో చెప్తారు', రోజాకు నిమ్మల కౌంటర్
డబ్బులు ఇస్తామంటే నేనే వెళ్లి ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పారు. కాగితాల మీద లెక్కలను చూపి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేయవద్దన్నారు. వారు నమ్మరని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ మెడలు వంచినా సరే ఏపీకి ఏం చేయరని తేల్చేశారు.
ఢిల్లీలో పోరాడాలని చంద్రబాబుకు చెప్పాను, ఏం చేస్తారో
ప్రత్యేక హోదా వల్ల ఢిల్లీలో పోరాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాను చెప్పానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఏం చేస్తారో వేచి చూడాలని వ్యాఖ్యానించారు. కాగా, ఈ నెల 20 నుంచి ప్రత్యేక హోదా కోసం టీడీపీ నిరసనలు ప్రారంభించనున్న విషయం తెలిసిందే. మరోవైపు ఎంపీ హరిబాబు ఆదివారం తీసుకు వచ్చిన పుస్తకం, ఆయన చేసిన విమర్శలను టీడీపీ తిప్పుకొడుతోంది.
అధిష్టానానికి భయపడి ఏపీ బీజేపీ నేతల అవాస్తవాలు
అధిష్టానానికి భయపడి, వాస్తవ స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రాంతానికో విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని, వారు వేసిన పుస్తకం అబద్దాలమయం అన్నారు. ఈమేరకు టీడీపీ నేత చందు సాంబశివరావు మండిపడ్డారు. రాజధాని అమరావతి కోసం రూ.1500 కోట్లు ఇచ్చామని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, ఆ నిధులతో మోడీ ప్రతిపాదించిన విగ్రహం కూడా పూర్తికాదన్న విషయం తెలియదా అన్నారు.
మోడీ సొంత డబ్బు కాదని తెలుసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం యూసీలు ఇవ్వలేదని చెప్పడం కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికేనని సాంబశివరావు మండిపడ్డారు. రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీ సొంత డబ్బు కాదనే విషయాన్ని గుర్తించాలన్నారు. బీజేపీ నేతలు తెలుసుకుంటే మంచిదన్నారు.
మూడేళ్లలో 85 శాతం నెరవేర్చాం
కాగా, ఆదివారం హరిబాబు మాట్లాడుతూ.. ప్రధానిని, బీజేపీని టీడీపీ నిందించినా ఏపీకి కేంద్రం సాయం ఆగదని చెప్పారు. విభజన హామీలు పదేళ్లలో పూర్తి చేయాలని ఉన్నప్పటికీ తాము 85 సాతం హామీలు మూడేళ్లలోనే నెరవేర్చామన్నారు. చట్టంలో చెప్పని వాటిని కూడా అమలు చేశామన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గతంలో చెప్పిన వాటిని హరిబాబు ప్రస్తావించారు.
చంద్రబాబు స్వాగతించారు కదా
గత ఏడాది ఏప్రిల్ 10న ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో 30 పార్టీల నేతలు పాల్గొన్నారని,. 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఎన్డీయేకు అఖండ మెజార్టీ ఇచ్చి మళ్లీ మోడీని ప్రధానిగా చెయ్యాలని చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశ పెట్టారని, అప్పుడలా మాట్లాడిన ఆయన ఇప్పుడిలా ఎందుకు చేస్తున్నారని హరిబాబు ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక నేపథ్యంలో హోదా ఇచ్చే అవకాశం లేకనే ఆర్థిక సాయం, ప్రత్యేక మద్దతుపై వెంకయ్య నాయుడు చొరవ తీసుకుని ఆరు నెలల పాటు ముమ్మరంగా చర్చించారన్నారు. దానినే కొందరు ప్రత్యేక సాయం అన్నారని తెలిపారు. చంద్రబాబు దాన్ని స్వాగతిస్తూ ప్రకటన చేశారని గుర్తు చేశారు.
అన్ని రాష్ట్రాలు అలాగే చేస్తాయి
స్వదేశీ ఆర్థిక సంస్థల ద్వారా సాయం చేయమని ఈ ఏడాది జనవరి మూడో తేదీన రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం అంగీకరించిందని హరిబాబు తెలిపారు. కేంద్రం, రాష్ట్ర రుణ పరిమితులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక వాహక సంస్థ(ఎస్పీవీ) ఏర్పాటు చేయాలని సూచించిందని, దీనిపై కేంద్రం ఎన్నిసార్లు అడిగినా రాష్ట్రం నిర్ణయానికి రాలేదన్నారు. 2014-15 బడ్జెట్లో రుణమాఫీ, ఇతర పథకాల లోటును భర్తీ చేయాలని రాష్ట్రం కోరుతోందని, దీనికి అంగీకరిస్తే అన్నిరాష్ట్రాలూ అదే చేస్తాయన్నారు.
టీడీపీ, కాంగ్రెస్ జెండాలు కలిసి కనిపించడం ఆశ్చర్యం
వెనకబడిన జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు 15 శాతం పెట్టుబడి రాయితీ, 15శాతం తరుగుదల రాయితీలను కేంద్రం ప్రకటించిందని, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.1,050కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని,
విభజన విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిన కాంగ్రెస్ మద్దతుతో కేంద్రంపై అవిశ్వాసం, ధర్నాలు చేయడం ఎంతవరకు సబబు అని హరిబాబు నిలదీశారు. ఆ పార్టీపై టీడీపీకి విశ్వాసం పెరిగిందా అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ జెండాలు కలిసి కన్పించడం ఆశ్చర్యం కలిగిస్తున్నాయిన్నారు. చంద్రబాబు హోదా అంతా రాజకీయం అని అభిప్రాయపడ్డారు.