జేసీ సంచలనం : ఇది జగన్ సునామీ..బాబుకు చెప్పాను: నా కుమారుడు వైసీపీలోకి వెళ్తే ....!
నాలుగున్నార దశాబ్దాల రాజకీయ జీవితానికి జేసీ దివాకర్ రెడ్డి గుడ్బై చెప్పారు. తాజా ఎన్నికల ఫలితాలు జగన్ సునామీ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మార్చుకోవాల్సిన అంశాల గురించి ఆయనకే చెప్పానని..ఆయన మారలేదని చెప్పుకొచ్చారు. ఇక, జగన్ ఢిల్లీలో ప్రధాని గురించి నిజాయితీగా మాట్లాడారని అభినందించారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్ మీద కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ వైసీపీలో చేరితే తాను అడ్డు చెప్పనని తేల్చి చెప్పారు. జగన్ మా వాడేనని స్పష్టం చేసారు.
జగన్ సునామీ..బాబకు చెప్పినా..
తన రాజకీయ అనుభవంలో ఎన్నడూ చూడని ఫలితాలు ఈ సారి చూసానని సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల్లో చంద్రబాబు మీద వ్యతిరేకత కనిపించిందని..ప్రజలు మార్పు కోరుకున్నారని అభిప్రాయపడ్డారు. ఇంత పెద్ద మొత్తంలో సీట్లు రావటం ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. జన్మభూమి కమిటీలు..సుదీర్ఘ టెలి కాన్ఫిరెన్స్లు పార్టీని ముంచుతాయని తాను పలు మార్లు చంద్రబాబుకు చెప్పినా..వినలేదన్నారు. ఢిల్లీలో ప్రధానిని కలిసిన తరువాత జగన్ ఏ మాత్రం గొప్పలకు పోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పారని..మోదీతో గొడవ పెట్టుకుని సాధించలేమని...లౌక్యంతోనే సాధించాలనే విషయాన్ని జగన్ చెప్పటాన్ని స్వాగతిస్తున్నానని చెప్పుకొచ్చారు.
తన కుమారుడు గురించి..
ఇక, తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డి తాజా ఎన్నికల్లో అనంతపురం టీడీపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. దీని పైన జేసీ స్పందిస్తూ ఓటమి పైన ఎటువంటి బాధ లేదన్నారు. పవన్ రెడ్డి వైసీపీలో చేరుతానంటే తాను అడ్డు చెప్పనని స్పష్టం చేసారు. విదేశాల్లో చదువుకున్న తన కుమారుడికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసని..తాను ఎప్పుడూ ఏం చేయాలో చెప్పనని వివరించారు. తాను మాత్రం రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని..తన వారుసుడి ఏం చేస్తాడనేది పవన్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తన కుమారుడి రాజకీయ పార్టీ మార్పు గురించి తాను ఎవరితో కలవలేదని వివరించారు. ఇక, జగన్ పైన తాను రాజకీయంగానే విమర్శలు చేసానని..కొన్ని సందర్భాల్లో నోరు జారి ఉంటానని అంగీకరించారు.
జగన్ మా వాడే ..ఎలాగంటే..
జగన్ తండ్రి వైయస్సార్ తాను సుదీర్ఘ కాలం ఒకే పార్టీలో కలిసి పని చేసామని గుర్తు చేసారు. జగన్ తనకు చిన్నప్పటి నుండి తెలుసని..అందుకే మా వాడని అంటూ ఉంటానని వివరించారు. ఎన్నికల్లో ప్రతీ నియోజకవర్గంలో 50 కోట్ల వరకు ఖర్చు చేసారని..దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ పాలన పైన స్పందించటానికి ఆయన నిరాకరించారు.