నేనే రెడ్డిని, దమ్ముంటే జగన్ చెప్పాలి: జెసి వివాదాస్పద వ్యాఖ్య
టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. రెడ్డి సామాజిక వర్గంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం : రెడ్డి సామాజిక వర్గం వల్లనే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని అనంతపురం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు జెసి దివాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపి జెసి ఆదివారం అనంతపురం జిల్లా నల్లమాడలో ఏర్పాటుచేసిన టిడిపి వ్యవస్థాపకులు, దింవగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో జెసి ఆయన మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ విగ్రహం లేని ఊరు దేవాలయం లేని ఊరితో సమానమని అన్నారు. తాను పుట్టుకతో కాంగ్రెస్వాదినని, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి దుర్వాసన వెదజల్లుతోందని అందుకే టిడిపిలోకి చేరానని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం కష్టాల్లో వుందన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో తాను అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని ప్రతి ఒక్కరినీ కలిసి విన్నవించానని, అయితే అప్పట్లో ఏ ఒక్కరూ తనకు సహకరించలేదని చెప్పారు. తెలంగాణలో కలిసి వుంటే అనంతపురం జిల్లా వాసులు ఆనందంగా వుండేవారన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తనకు ఒక విషయంలో ఎప్పుడూ విభేదం వస్తుంటుందన్నారు. ప్రస్తుతం ఒక బీడీ కొనాలన్నా 50 పైసలు, టీ తాగాలంటే రూ. 5 వెచ్చించాలని, ఇక ప్రభుత్వం కిలో బియ్యం రూ. 20తో కొనుగోలు చేసి రూ. 1కే అందజేయడాన్ని తాను విభేదిస్తున్నానని అన్నారు.
రాయలసీమలో తానొక్కడినే రెడ్డిని అని రాజకీయ నేతల్లో రెడ్డి కులస్తులు ఎవరూ లేరన్నారు. సగర్వంగా చెప్పుకునే రెడ్డిని తాను మాత్రమేనని అన్నారు. దమ్ముంటే తాను రెడ్డినే అని జగన్ ప్రకటించాలని సవాల్ విసిరారు. ఇతర కులాలవారంటే ద్వేషం లేదని, రెడ్డి కులాలకు చెందిన వారు తన దగ్గరికి వస్తే సాయం చేసే భావన తనలో ఉందన్నారు.
రెడ్లే రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఉమ్మడి రాష్ర్టాన్ని చీల్చారని దివాకర్రెడ్డి విమర్శించారు. కొందరు రెడ్లు రాష్ట్రాన్ని చీల్చి నాశనం చేశారని నిప్పులు చెరిగారు.రాష్ట్ర విభజనకు ముందు మొదటి నుంచీ నెత్తి బాదుకున్నా. చేతులు పట్టుకున్నా.. రెడ్లు ఎవరూ పట్టించుకోలేదని జేసీ ఇంతకు ముందు అన్నారు.