టిడిపిలో చిచ్చు: కాళ్లు పట్టుకుంటా, జుత్తూ పట్టుకుంటా.. జేసీ సంచలనం, దీక్ష భగ్నం
అనంతపురం అభివృద్ధికి కొందరు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు.
అనంతపురం: అనంతపురం అభివృద్ధికి కొందరు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు. పాతూరులో తిలక్ రోడ్డు, గాంధీ బజారు రోడ్ల విస్తరణను అడ్డుకుంటున్నందుకు నిరసనగా ఆయన నగర పాలక సంస్థ ఎదుట సోమవారం నిరసన దీక్ష చేపట్టారు.
దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయన మద్దతుదారులు, కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు.
జేసీకి పోటీగా తిలక్ రోడ్డులో మైనార్టీల ఆందోళన
జేసీ దీక్షకు పోటీగా తిలక్ రోడ్డులో మైనార్టీలు భారీ ఆందోళన చేశారు. సమస్య పైన చర్చించేందుకు వెంటనే సీఎంవోకు రావాలని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, కలెక్టర్ శశిధర్కు సమాచారం ఇచ్చారు.
కాగా, అంతకుముందు, రోడ్ల విస్తరణను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట జేసీ దివాకర్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. జేసీతో దీక్ష విరమింప చేసేందుకు టిడిపి నేతలు ప్రయత్నించారు.
సీఎం చంద్రబాబు హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించేది లేదన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ జేసీ ఆరోపించారు. అనంతపురం అభివృద్ధికి ఎమ్మెల్యే, కమిషనర్, మేయర్ అడ్డుపడుతున్నారన్నారు.
ఈ ముగ్గురూ కుమ్మక్కై రోడ్డు విస్తరణ పనులను అడ్డుకుంటున్నారన్నారు. వీరిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అనంతపురం అభివృద్ధి కోసం తాను ఎవరి కాళ్లయినా సరే పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
అవసరమైతే చేతులు పట్టుకుంటా లేదంటే కాళ్లు పట్టుకుంటానని, అదీకాకపోతే జుట్టు పట్టుకుని ఉతికైనా సరే అనంతపురాన్ని బాగుచేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఓ దశలో పల్స్ రేటు పడిపోవడంతో పోలీసులు ఆందోళన చెందారు. దీంతో జేసీ దీక్ష భగ్నం చేశారు.