కుమ్మక్కు: అధిష్టానం, జగన్లపై జెసి సంచలనం
హైదరాబాద్: తమ పార్టీ అధిష్టానంపై, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించారు. కాంగ్రెసు అధిష్టానం వైయస్ జగన్తో కుమ్మక్కయిందని ఆయన ఆరోపించారు. జగన్తో కాంగ్రెసు అధిష్టానం ఫిక్స్ చేసుకుందని, దీనికి 144 దృష్టాంతాలున్నాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
జగన్తో కాంగ్రెసు అధిష్టానం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందననే విషయంలో ఎవరికీ అనుమానాలు అక్కరలేదని ఆయన అన్నారు. జగన్కు బెయిల్ రావడం అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. జగన్కు బెయిల్ రావడంలో తప్పు లేదని, అయితే సిబిఐ క్లిన్ చిట్ ఇవ్వడమే తప్పు అని ఆయన అన్నారు. కేసులో ఏం తేలిందని జగన్కు క్లీన్ చిట్ ఇచ్చారని ఆయన అడిగారు.
కాంగ్రెసు అధిష్టానం చొరవతోనే వైయస్ జగన్ హైదరాబాద్ సమైక్య శంఖారావం సభ విజయవంతమవుతోందని ఆయన అన్నారు. ఇతర ప్రాంతాలకు అపేసి, జగన్ సభ కోసం 14 రైళ్లను మళ్లించారని ఆయన చెప్పారు. ఎవరెలా పోతే ఏమిటని చెప్పి కాంగ్రెసు అధిష్టానం కాంగ్రెసుతో కుమ్మక్కయిందని ఆయన అన్నారు. ఢిల్లీలో అధికారం కోసం అధిష్టానం రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని సర్వనాశనం చేసిందని ఆయన అన్నారు.
సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ సర్వనాశమైందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీని భూస్థాపితం చేయడానికి అధిష్టానం ఎప్పుడో కొబ్బరి కాయ కొట్టిందని ఆయన అన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ రాసి దమ్ముందని నిరూపించుకున్నారని ఆయన కొనియాడారు.
అధిష్టానం చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి తప్పుగా ఏమైనా మాట్లాడారా అని అడిగారు. కాంగ్రెసు అధిష్టానంతో కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కు కాలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సాహసాన్ని ఆయన అభినందించారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ చనిపోయిందని, పార్టీ పని అయిపోయిందని ఆయన అన్నారు.