శాంతిభద్రతలు అదుపుతప్పాయి! ఆ ఎమ్మెల్యే కారణంగానే.: బాబుకు చిట్టా అంటూ జేసీ, మీడియాపైనా..
అనంతపురం: ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితోపాటు ప్రభుత్వ అధికారులు, పోలీసులపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసు పేరుతో నేరస్తులకు దండం పెట్టి ఎదుట కూర్చోబెట్టుకుంటున్నారని మండిపడ్డారు.
అక్రమాలు జరుగుతున్నా..
బుధవారం జేసీ దివాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అనంతపురం నగరంలో ప్రభుత్వ ఆస్తులు అక్రమార్కుల పాలవుతున్నా పట్టించుకునే అధికారి లేడంటూ తీవ్రంగా ఆరోపించారు. జిల్లా కలెక్టర్, జేసీలకు తాను స్వయంగా ఫిర్యాదు చేసినప్పటికీ తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు.
శాంతి భద్రతలు అదుపు తప్పాయి..
అనంతపురం జిల్లాలో పోలీసు వ్యవస్థ గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వీర్యమైపోయిందని, శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని జేసీ ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఉద్దేశించి జేసీ ధ్వజమెత్తారు.
ప్రభాకర్ చౌదరి కారణంగానే.. సీఎంకు చిట్టా
ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కారణంగా తాను అనంతపురంలో ప్లాస్టిక్ వాడకం నిరోధించలేకపోయానని, రోడ్లు విస్తరించలేకపోయానని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోని అధికారుల చిట్టాను ఆధారాలతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుంచుతానని చెప్పారు.
మీడియాను విచిపెట్టలేదు..
ఆ తర్వాత మీడియాపైనా జేసీ విమర్శలు చేశారు. అనంతపురంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా మీడియా ప్రతినిధులు కళ్లు మూసుకుంటున్నారని కూర్చున్నారంటూ జేసీ దివాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.