జగన్ మూర్ఖత్వంతోనే అప్పుడు సీఎం కాలేదు! ఇప్పుడూ అలానే: జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
గుంటూరు: ఏపీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జగన్ మూర్ఖత్వం వల్లే..
మూర్ఖత్వం వల్లే జగన్ ఆనాడు వైఎస్ చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కోల్పోయారని, కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే మూర్ఖత్వంతో నేడు సీఎంగా పతనమవుతున్నారని జేసీ విమర్శించారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఒకరిపై ద్వేషంతో..
ఒకరిపై ద్వేషంతో కులం, ప్రాంతాల మధ్య జగన్ చిచ్చు పెట్టారని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. మనిషికి తన ఎలాంటిదో రాష్ట్రానికి రాజధాని కూడా అలాంటిందేనని జేసీ అన్నారు. అమరావతిలోనే రాజధాని ఉందని ప్రజలు మభ్యపెడుతున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు.
10 క్యాంప్ ఆఫీసులు పెట్టుకోండి కానీ..
సచివాలయం ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం ఒకటి కాదు పది క్యాంప్ ఆఫీసులు పెట్టుకోవచ్చని, పరిపాలన మాత్రం అమరావతి నుంచి జరగాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు తప్ప సామాన్యులకు అసెంబ్లీ పనికాదని చెప్పారు.
కడప రాజధానిగా ఉద్యమం..
జనవరి 23న రాయలసీమ ప్రజలను పిలిచి చర్చ జరపాలని జేసీ దివాకర్ రెడ్డి జగన్ సర్కారును డిమాండ్ చేశారు. లేదంటే కడపను రాజధాని చేయాలంటూ ఆందోళన చేయాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కి పూర్తి విరుద్ధంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. వాళ్ల నాయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చొప్పుకుని ముఖ్యమంత్రి అయిన జగన్.. ఈ నెలల్లో ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు.
భారతి సీఎం అవుతుందంటూ..
రాజధాని తరలింపు నిర్ణయం మంచిది కాదని అన్నారు. జేసీ దివాకర్ రెడ్డి మొదటి నుంచి కూడా మూడు రాజధానుల అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అమరావతినే రాజధానిగా ఆయన డిమాండ్ చేస్తున్నారు. త్వరలోనే జగన్మోమన్ రెడ్డి సతీమణి భారతి సీఎం అవుతుందంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు.