చిరంజీవే పవన్ కళ్యాణ్కు శాపం, బాబు కరుణ: జేసీ సంచలనం, వైసీపీ నేత చేరికపై షాక్
Recommended Video
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి గురువారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతున్నాయి. జేసీ తరుచూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశంపై, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నాయకత్వంలో గుర్నాథ్ రెడ్డి (వైసీపీ నుంచి టీడీపీలో చేరితే) పని చేసే విషయం.. తదితర అంశాలపై జేసీ అమరావతిలో మాట్లాడారు.
మరో వికెట్, జగన్కు గుర్నాథ్రెడ్డి షాక్: కారణాలివే.. బాబుకు ప్రభాకర్ హింట్, అంతలేదంటూ హామీ
పవన్ కళ్యాణ్కు చిరంజీవి పెద్ద శాపం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తన సోదరుడు చిరంజీవి పెద్ద శాపం అని జేసీ వ్యాఖ్యానించారు. నాడు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి, ఆ పార్టీని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని గుర్తు చేశారు. చిరంజీవి పెద్ద పొరపాటు చేశారని వ్యాఖ్యానించారు. చిరు చేసిన పొరపాటు పవన్కు మైనస్ అని అభిప్రాయపడ్డారు.
పవన్ పేరు సంపాదించారు, పంట పండాలి కదా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాగా కష్టపడి సినిమాల్లో మంచి పేరు సంపాదించుకున్నారని జేసీ తెలిపారు. జనసేన పార్టీ స్థాపించడంపై మాట్లాడుతూ.. విత్తనాలు వేస్తే సరిపోదని, పంట కూడా బాగా పండాలని వ్యాఖ్యానించారు.
నేను పోటీ చేయను
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీలు కరివేపాకల్లా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో పోటీ చేయడానికి ఏముందని, కనీసం పలకరించే వారు ఉండరన్నారు. తన కుమారుడు ఎంపీగా పోటీ చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. ఆయన పోటీ చేసే అవకాశముందని తేల్చి చెప్పారు.
చంద్రబాబు కరుణిస్తేనే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరుణిస్తే తన కుమారుడు అనంతపురం నుంచి పోటీ చేస్తారని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు కరుణ అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభాకర్ చౌదరి నేతృత్వంలో గుర్నాథ్ రెడ్డి పని చేయడంపై
వైసిపి నేత గుర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నేతృత్వంలో గుర్నాథ్ రెడ్డి పని చేస్తారా అంటే.. జేసీ తనదైన శైలిలో స్పందించారు. ఇక్కడ ఎవరైనా చంద్రబాబు నేతృత్వంలోనే పని చేయాలని స్పష్టం చేశారు. ప్రభాకర్ చౌదరి నాయకత్వంలో కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు కావాలని గుర్నాథ్ రెడ్డి కోరలేదని తెలిపారు. కాగా, గుర్నాథ్ రెడ్డి చేరితో మీ నేతృత్వంలోనే పని చేస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ జేసీ అందుకు భిన్నంగా మాట్లాడి అధినేతకు షాకిచ్చారు.
అందరిపై అవినీతి ఆరోపణలు
అవినీతి ఆరోపణల గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లో దాదాపు అందరిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని జేసీ అన్నారు. మిస్సమ్మ బంగ్లా విషయంలో కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. తప్పు చేస్తే చర్యలు తీసుకుంటారని తెలిపారు. కాగా, వైసీపీ అధినేత వైయస్ జగన్పై అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జేసీ అందరి పైనా అవినీతి ఆరోపణలు వస్తున్నాయని చెప్పడం గమనార్హం.