హోదా కాకపోయినా నిధులు, జనసేనలోకి రమ్మంటే నో చెప్పా: జేసీ సంచలనం, పవన్ ఆపరేషన్?
Recommended Video
న్యూఢిల్లీ/అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం పార్లమెంటు సభ్యుడు సోమవారం ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, బీజేపీ, జనసేన అధినేత పవన్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చదవండి: 'జగన్ చెప్పినట్లుగా వింటున్న చంద్రబాబు, రేపు టీడీపీ ఎంపీల రాజీనామా చేయొచ్చు!'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చేసే పోరాటం బూడిదలో పోసిన పన్నీరే అన్నారు. తనకు ఈ వాస్తవం తెలిసినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు కాదనలేక ఢిల్లీలో నిరసనల్లో పాల్గొన్నానని వ్యాఖ్యానించారు.
చదవండి: నిన్న చిరంజీవి, రేపు జనసేన: పవన్ 'కొత్త స్నేహం'తో ఆ పార్టీల్లో వణుకు?
హోదా ఇవ్వకపోయినా అలా సరే
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ మొండి వైఖరి తెలిసినందువల్లే ఈ రకంగా మాట్లాడుతున్నానని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా అనే పదం కాకపోయినా దానికి సమానంగా తగిన నిధులు కేటాయిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు.
ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటా
తాము కోరే విధంగా కేంద్రం తగిన నిధులు కేటాయిస్తే ఏపీ ప్రజలను ఒప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని జేసీ అన్నారు. అంతకుముందు ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. మోడీ ఓ శిల అని, అతనికి ప్రేమించే గుణం లేదని దుయ్యబట్టారు.
పవన్ రమ్మన్నారు, తిరస్కరించా
పవన్ కళ్యాణ్ పైన కూడా జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ తరఫున కొందరు దూతలు తన వద్దకు వచ్చారని, జనసేనలో చేరమని ఆఫర్ ఇచ్చారని వ్యాఖ్యానించారు. కానీ పార్టీ మారాలన్న ఆ ప్రతిపాదనను తాను తోసిపుచ్చానని చెప్పారు.
జనసేన గల్లంతు, జగన్కు సవాల్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గల్లంతు కావడం ఖాయమని జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలన్న వైసీపీ అధినేత వైయస్ జగన్కు జేసీ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ తమ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలతో రాజీనామా చేయిస్తే తాను టీడీపీ తరఫున రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.
పవన్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టాడా?
జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించాడా అనే చర్చ సాగుతోంది. 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్.. ఇతర పార్టీల నుంచి కీలక నేతలను తీసుకునే పనిని ప్రారంభించారా అనే చర్చ సాగుతోంది.