బాబుకు భయపడట్లేదు, జగన్కు ఆ దమ్ముందా, మర్డర్ చేసిన వారిని..: జేసీ సంచలనం
అనంతపురం టిడిపి పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ప్రముఖ తెలుగు ఛానల్ ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని పనులు తానే చేయాలని చంద్రబాబు అనుకుంటారని, తన కొడుకు వైసిపిలో చేరుతారో ల
విజయవాడ: అనంతపురం టిడిపి పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ప్రముఖ తెలుగు ఛానల్ ఎన్టీవీ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని పనులు తానే చేయాలని చంద్రబాబు అనుకుంటారని, తన కొడుకు వైసిపిలో చేరుతారో లేదో తనకు తెలియదని, మర్డర్లు చేసిన అనుచరులను అయిష్టంగా కాపాడుకుంటూ వస్తున్నానని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ చచ్చింది, జగన్ గెలవొద్దనే..
విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయిందని, అందుకే తాను తెలుగుదేశం పార్టీలో చేరానని జేసీ అన్నారు. వైసిపి అధినేత జగన్ గెలువవద్దనే తాను 2014 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరానని చెప్పారు. జగన ముఖ్యమంత్రి అయితే ఏపీకి మంచిది కాదనే సైకిల్ ఎక్కానని చెప్పారు.
భయపడట్లేదు.. చంద్రబాబుపై ఆసక్తికరం
అన్ని పనులు తాను ఒక్కడినే చేయాలని చంద్రబాబు అనుకుంటారన్నారు. అధికారుల మాటే చంద్రబాబు వింటున్నారని చెప్పారు. గతంలోలాగా చంద్రబాబుకు పార్టీ నేతలు భయపడటం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చూశానని, చంద్రబాబుకు ఓ విజన్ ఉందన్నారు. అధికారుల మాట చంద్రబాబు వింటున్నారని తాను చెప్పానని, అలా వద్దని సలహా ఇచ్చానని, కానీ తన మాట వినాల్సిన అవసరం ఆయనకు లేదన్నారు. అదే లీడర్ అన్నారు. నేను చెప్పిన దాంట్లో తప్పున్నదనుకున్నప్పుడు అనుభవం ఉన్న అలాంటి నేత ఎందుకు వింటారని ప్రశ్నించారు.
బీజేపీ మోసం, టిడిపిపై ప్రభావం
ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ మోసం చేసిందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. హోదా ప్రభావం తెలుగుదేశం పార్టీ పైన కూడా పడుతుందని తన అభిప్రాయం అన్నారు. బీజేపీతో కలిసి ఉండేది అధిష్టానం ఇష్టమన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు. 40 ఏళ్ల పాటు ప్రజా జీవితంలో ఉన్నానని చెప్పారు. నేనేమైనా ముఖ్యమంత్రిని కావాలా, వీటికి అవకాశం లేదని, దానికి ఎందుకు అవకాశం లేదనేది పక్కన పెట్టాలని, తనకు విధి రాత పైన నమ్మకం ఉందని, అయి ఉంటే రోశయ్య గారు కాకముందే ముఖ్యమంత్రి అయి ఉండేవాడినన్నారు. ఇక ఆ అవకాశం లేదన్నారు.
కరివేపాకుల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలు, ఎంపీ పదవులు రద్దు చేయడం మంచిదని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధులు కరివేపాకుల్లా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. నా దృష్టిలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిలకే పదవులు అని, మిగతా వాళ్లంతా వట్టిదేనని అభిప్రాయపడ్డారు. ఎంపీగా తాను సంతృప్తిగా లేనని చెప్పారు.
నా చేతికి రక్తం అంటలేదు కానీ
తమ చేతికి ఎక్కడా రక్తం అంటలేదని జేసీ అన్నారు. తాము ఎవర్నీ హత్య చేయమని చెప్పలేదన్నారు. అయితే, అలా చేసిన తమ అనుచరులను అయిష్టంగానే కాపాడుకుంటూ వస్తున్నామని చెప్పారు. తమకు ఫ్యాక్షన్ అంటే ఏమాత్రం గిట్టదన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరాక వీక్ కాలేదన్నారు.
ముఖ్యమంత్రిని నేనే కావాలి కానీ..
తనకు పదవుల మీద వ్యామోహం పోయిందని జేసీ అన్నారు. రోశయ్య కంటే ముందు తానే ముఖ్యమంత్రిని కావాలని చెప్పారు. తాను రెడ్డినని, కచ్చితంగా గర్వంగా చెబుతానని జేసీ అన్నారు. రాష్ట్రం విడిపోతుందని తాను ముందే చెప్పానని, ఇప్పుడు ప్రత్యేక హోదా రాదని కూడా చెప్పానన్నారు. కేంద్రమంత్రి పదవి తనకు రాకపోవడంపై అసంతృప్తి లేదన్నారు. అశోక్ గజపతి రాజు చాలా చాలా సీనియర్ అని, సుజనా చౌదరి ముఖ్యమంత్రికి దగ్గర అన్నారు. మరో అవకాశముంటే తనకు ఇచ్చేవారేమోనని, కానీ తాను నిన్న కాక మొన్న కాంగ్రెస్ నుంచి టిడిపిలో వచ్చానని చెప్పారు. తనకు ఎలా పదవి వస్తుందన్నారు.
అనంత ఎవడబ్బ సొత్తు కాదు
అనంతపురం అభివృద్ధిపై ఇటీవల సొంత పార్టీ నేతలతో విభేదాలు వచ్చాయి. దీనిపై జేసీ మాట్లాడుతూ.. అనంతపురం ఎవడి అబ్బ సొత్తు కాదన్నారు. అభివృద్ధి చేయాలనుకుంటే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేల ప్రవర్తన బాగా లేదన్నారు. అది పార్టీకే నష్టమని చెప్పారు.
జగన్ వంద శాతం రెడ్డా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ రెడ్డియా అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన క్రిష్టియన్ అన్నారు. ఇక రెడ్డి ఎలా అవుతారని ప్రశ్నించారు.
జగన్కు సీటుకు డబ్బులడిగే దమ్ముందా
జగన్కు తనను సీటుకు డబ్బులు అడిగే దమ్ము ఉందా అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అయితే 2014 ఎన్నికల సమయంలో సీటు ఇస్తే ఇంత ఖర్చు చేయాలని, అంత ఖర్చు పెట్టాలని కబురు పెట్టారన్నారు. జగన్కు ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు లేవని చెప్పారు. ఎప్పుడు మహానేత అనడం తప్ప, అధికారంలోకి వస్తే తాను ఏం చేస్తానో జగన్ చెప్పడం లేదని, అందుకే గెలవడనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. తన కొడుకు పవన్ కుమార్ వైసిపిలో చేరుతారో లేదో తెలియదని, అది అతని ఇష్టమని చెప్పారు.
పరిటాల సునీతపై...
పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ తమ నియోజకవర్గం పైన దృష్టి సారించారన్నారు. అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరామ్ పెత్తనం చెలాయిస్తున్నాడనే వాదనలో వాస్తవం లేదన్నారు. పరిటాల శ్రీరామ్ తమ నియోజవకర్గంలో హవా సాగిస్తుంటే విపరీతార్థం తీయాల్సిన అవసరం లేదన్నారు.