రాష్ట్ర విభజన: జెసి దివాకర్ రెడ్డి ఏట్లో గడ్డిపోచ సూక్తం
హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర నేతలు వివిధ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ ప్రయత్నాలపై జెసి మాట్లాడుతూ.. ఏట్లో కొట్టుకుపోయేవాడిని గడ్డిపోచ ఆపలేదని తెలిసినా దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడని, అలాగే రాష్ట్ర విభజనను అడ్డుకునే విషయంలోను తమది అదే పద్దతి అని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో ఏం తప్పు చేశారని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై అవిశ్వాసం పెట్టాలని జెసి ప్రశ్నించిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని 371-డి ఉండగా తెలంగాణ రాదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ కోరిక మేరకు ప్రొరోగ్ విషయమై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని, దానిని ప్రభుత్వం గవర్నర్కు పంపుతుందని తెలిపారు. అవిశ్వాసం పెడతామన్న వారిని ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో ప్రశ్నించాలన్నారు. ఇప్పటికి ఏమీ తప్పుడు పనులు చేయలేదని, గౌరవ ప్రదంగా అసెంబ్లీని నడుపుతున్నారని, అవిశ్వాసం పెట్టాల్సిన అవసరమే లేదన్నారు. అలాంటి బుద్ధి పుట్టిందంటే అది సరికాదన్నారు.
ప్రొరోగ్ చేయాలంటూ సిఎంవో నుంచి అధికారికంగా లేఖ వచ్చినందున, అది అధికారికంగానే జరిగిపోతుందన్నారు. ప్రతి విషయానికి ఒక సమయం ఉంటుందని అన్నారు. స్పీకర్ ఏది మంచిదనుకుంటే అది చేస్తారని అన్నారు. ప్రొరోగ్ చేయాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని గాదె వెంకట రెడ్డి అన్నారు.