పవన్-జగన్లను కలిపేందుకు 'ఢిల్లీ' ప్రయత్నాలు, అప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి నేతలు: జేసీ సంచలనం
Recommended Video
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలపాలని ఢిల్లీలో కొందరు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సింగపూర్కు వెళ్లి మోడీని అంటావా: బాబుపై హరిబాబు, 'ఏపీకి కేంద్రం సాయం'పై బుక్
వారిద్దరిని కలపాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నప్పటికీ.. ఆ ఇద్దరు నేతలు కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే ఢిల్లీ పెద్దలు చేసే ప్రయత్నాలు ఏమాత్రం సఫలం కావని తేల్చి చెప్పారు. అయితే, తనకు పదవులపై ఆసక్తి లేదని పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ.. జేసీ ఆయన కూడా సీఎం పదవి కోరుకుంటున్నారని చెప్పడం గమనార్హం.
అవినీతిపై విచారణ సరే, ఏం చేశారో చెప్పండి
ఏపీలో అవినీతి చోటు చేసుకుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల పైన విచారణ జరపాలని కొందరు అంటున్నారని, వారు ఏం అవినీతి చేశారో చెబితే విచారణ జరుపుతారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఏం చెప్పకుండా విచారణ ఎలా అని ప్రశ్నించారు.
వారికి టిక్కెట్లు రావు
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా చంద్రబాబు నాయుడు పైన విచారణ జరిపారని జేసీ దివాకర్ రెడ్డి గుర్తు చేశారు.కానీ ఏమీ చేయలేకపోయారని తెలిపారు. 2019 ఎన్నికలలో అవినీతిపరులు, సమర్థవంతంగా పని చేయని వారికి తమ పార్టీ నుంచి ఇక టిక్కెట్లు రావని తేల్చి చెప్పారు.
అప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి
సరిగా పని చేయని వారికి టిక్కెట్లు నిరాకరించే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అలా టిక్కెట్లు రాని వారు చివరి నిమిషంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పారు. కాబట్టి చివరి నిమిషం వరకు వైసీపీ నిరీక్షించాల్సిందే అన్నారు.
అధికారంలోకి వస్తామని కలలు
వైసీపీ అధినేత వైయస్ జగన్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డిలు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. అలాగే టీడీపీ నుంచి తమ పార్టీలోకి వస్తారని కొందరు చెబుతున్నారని, కానీ అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి ఎవరైనా ప్రతిపక్షంలోకి వెళ్తారా అని ప్రశ్నించారు.
జిల్లాల్లో, అమరావతిలో మంత్రులు
ఈ నెల 20న సీఎం చంద్రబాబు చేపట్టనున్న నిరసన దీక్షకు మద్దతుగా 175 నియోజకవర్గాల్లో సామూహిక దీక్షలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. నియోజకవర్గ దీక్షల్లో ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ నేతలు పాల్గొంటారు. పదమూడు జిల్లాల్లో 13 మంది మంత్రులు దీక్షల్లో పాల్గొని, మిగతా మంత్రులు అమరావతిలో దీక్షలో పాల్గొంటారు. చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంచార్జులు హాజరయ్యారు. ఈ నెల 21నుం చి ప్రతి నియోజకవర్గంలో సైకిల్ యాత్రలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా నేతలకు సూచించారు. పదిహేను నుంచి ఇరవై రోజులపాటు అన్ని గ్రామాల్లో టీడీపీ సైకిల్ యాత్రలు నిర్వహించాలని, నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు జరపాలని, అన్ని నియోజకవర్గాలలో ప్రభుత్వ విజయాల పండుగలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. రోజుకో విజయం గురించి ప్రచారం చేయాలని. ఒకరోజు సిమెంట్ రోడ్ల గురించి, మరొకరోజు విద్యుత్ విజయాలు, ఇంకో రోజు పింఛన్లపై ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. పనులు చేయడం ఎంత ముఖ్యమో వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లడం అంతే ముఖ్యమన్నారు. ఏపీలో అభివృద్ధి బాగుందని తమిళనాడులో ప్రచారం సాగుతోందన్నారు. చరిత్రలో గతంలో జరగని అభివృద్ధిని ఈ నాలుగేళ్లలో చూపించామన్నారు.