అలిగితే లాభంలేదు, చంద్రబాబుకు చెప్పా: జేసీ, రాజీనామా నిర్ణయంపై ఆసక్తికర చర్చ!!
అమరావతి: అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోమవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో జేసీ అధినేతను కలిసేందుకు వచ్చారు. అయితే సచివాలయానికి రావాలని ముఖ్యమంత్రి పేషీ ఆయనకు సూచించింది. దీంతో సచివాలయంలోని సీఎం బ్లాక్లో అధినేతతో భేటీ కోసం వచ్చారు.
Recommended Video
రెండు రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. ఆ సమయంలోనే జేసీ దివాకర్ రెడ్డి అధినేతతో రెండు మూడు నిమిషాలు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి భేటీ ఆసక్తిని రేపింది. జేసీ చల్లబడ్డారా లేక రాజీనామా చేస్తారా అనే చర్చ కూడా సాగుతోంది.
అలకకు సంబంధం లేదు
దేశంలో ఎవరి మీద అలగలేమని, అలిగితే ప్రయోజనం ఉండదని జేసీ వ్యాఖ్యానించారు. తాను పార్లమెంటుకు వెళ్లకపోవడానికి, అలకకు సంబంధం లేదని చెప్పారు. సీఎం చంద్రబాబును కలిశానని, తాను ఏం మాట్లాడానో కూడా చెప్పానని అన్నారు. రాజకీయ వాతావరణం బాగా లేదని చెప్పానని, ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని జేసీ తెలిపారు. ప్రధానిగా మోడీ ఉన్నంత కాలం పోరాడాల్సిందే అన్నారు. రాజకీయాల్లో అతివృష్టి, అనావృష్టి ఉండకూడదని చెప్పారు.
తాను ముఖ్యమంత్రితో చాలా విషయాలు మాట్లాడానని, కానీ ఏం మాట్లాడానో చెప్పనని తేల్చి చెప్పారు. అంతా సమసిపోయిందన్నారు. ఇంకా ఉంటే సమయం వచ్చినప్పుడు చెబుతానన్నారు. సీడబ్ల్యుసీ సమావేశంలో ప్రత్యేక హోదాపై తీర్మానం ఒట్టి మాటే అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేని కాంగ్రెస్ ఇప్పుడేం చేస్తుందని ప్రశ్నించారు. కాగా, చంద్రబాబుతో 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాజీనామాపై గట్టిగా హితబోధ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇటీవల, మోడీ ప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టగా, తాను చర్చకు హాజరయ్యేది లేదని జేసీ పట్టుబట్టి కూర్చున్నారు. తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు. పలు డిమాండ్లు అధిష్టానం ముందు ఉంచారు. జేసీ అలక నేపథ్యంలో ఆగమేఘాల మీద నిధుల కోసం జీవో జారీ చేశారు. చంద్రబాబు కూడా ఆయనతో మాట్లాడారు. దీంతో ఆయన కొంత చల్లబడ్డారు. అవిశ్వాస తీర్మానం చర్చలో పాల్గొంటానని, కానీ ఎంపీ పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నానని, దానిపై తర్వాత చెబుతానని అన్నారు. రాజీనామా, డిమాండ్లపై చంద్రబాబు కూడా అవిశ్వాసంపై చర్చ అనంతరం మాట్లాడుదామని చెప్పారు. ఇప్పుడు వారిద్దరు భేటీ అయ్యారు.