కమ్యూనిస్టులపై జేసీ దివాకర్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు
అనంతపురం: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. కమ్యూనిస్టులంత దొంగలు ఎవరూ లేరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అనంతపురం జిల్లా గార్లదిన్నెలో జరిగిన రైతు సదస్సులో జేసీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతుల సమస్యలను విన్నవించేందుకు కొంతమంది కమ్యూనిస్టు నాయకులు అక్కడికి వచ్చారు. వారిని ఉద్దేశించి మాట్లాడిన జేసీ అభ్యంతరకర పదజాలాన్ని వినియోగించారు. తాను అసెంబ్లీకి వెళ్లినప్పుడు కమ్యూనిస్టులు అంటే గొప్పవారని, నిజాలను నిర్భీతిగా వెల్లడిస్తారని భావించానని చెప్పారు.
అయితే రానురాను తన అభిప్రాయం సరికాదని తెలిసిందని జేసీ అన్నారు. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని కమ్యూనిస్టులు 16 రూపాయలకు కిలో చొప్పున అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కాగా, ఎంపీ అభ్యంతరకర పదజాలాన్ని వాడుతూ దూషిస్తూ ఉంటే ఆయన చుట్టూ ఉన్నవారు నవ్వుతూ ఉండటం శోచనీయం.