అసమర్థున్ని అనిపించుకోవాలా?, ఆ పేరు నాకొద్దు: రాజీనామాపై జేసీ కీలక వ్యాఖ్యలు
Recommended Video
న్యూఢిల్లీ: తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదని, ఎప్పట్నుంచో అనుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఓ మీడియా ఛానెల్తో మాట్లాడుతూ.. వివిధ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను పుట్టిన నాటి నుంచి రాజకీయాల్లోనే ఉన్నానని.. రోజు రోజుకు దిగజారిపోతున్న రాజకీయాలను చూసి విరక్తిపుట్టిందని జేసీ అన్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
వాటినిక నేను బలికావాలా?
తాను ప్రజలకు మంచి చేయాలని ఏదో ఒకటి చేస్తే.. వర్గం, కులం, మతం అడ్డువస్తున్నాయని అన్నారు. ఇన్నేళ్లపాటు రాజకీయాల్లో ఉండి.. వీటన్నింటికీ తాను బలికావాలా? అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. తాను ఎప్పుడూ పది రూపాయలు ఆశించి ఏ పని చేయలేదని.. అలాంటి ప్రజా జీవితంలో తాను లేనని జేసీ చెప్పారు.
అసమర్థున్ని అనిపించుకోవాలా?
కేంద్రం, రాష్ట్ర రాజకీయాల్లో ఆశించిన వాతావరణం లేదని జేసీ అన్నారు. కలుషితమైన ఈ రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని భావిస్తున్నట్లు జేసీ తెలిపారు. చాలా కాలం నుంచి రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇన్నేళ్ళ రాజకీయంలో ఇప్పుడు అసమర్థున్ని అని అనిపించుకుంటానేమోననే భయం వేస్తోందని జేసీ వ్యాఖ్యానించారు.
జేసీపై ప్రజలకు నమ్మకం
మాట ఇస్తే నిలబెట్టుకుంటారనే విశ్వాసం ప్రజలకు తనపైన ఉందని.. దాన్ని పోగొట్టుకోవడం తనకు ఇష్టం లేదని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. అందుకే ముందే రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అనంతపురం రోడ్ల వెడల్పు సమస్యపై స్థానిక నాయకులు, సీఎం చెప్పాలని అన్నారు. రూ.40కోట్లతో రోడ్డు పనులు చేయడం ముఖ్యం, అమ్యామ్యాలు కాదని అన్నారు. తన హామీ నెరవేరకపోతే తనకు చెడ్డ పేరు వస్తుందని, ఇప్పుడు తనకు అది అవసరమా? అని ప్రశ్నించారు.
రాజీనామాపై త్వరలోనే..
దేశంలో మంచి జరిగినా, చెడు జరిగినా ప్రధాని నరేంద్ర మోడీకే వెళుతుందని, ఆయన డైరెక్టుగా బాధ్యుడు కాకున్నా.. ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని జేసీ అన్నారు. తాను మీడియాలో కనిపించేందుకు ఏమీ చేయనని చెప్పారు. తాను మీడియాకు చెప్పే రాజీనామా చేస్తానని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.