చంద్రబాబును జేసీ ఇంతలా పొగిడేశారేంటి..!
ఇంతకాలం జేసీ దివాకర్ రెడ్డి ఒక్కరే పార్టీతో సంబంధం లేకుండా తనకు నచ్చిన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే వ్యక్తి అని అనుకుంటున్న జనం ఇకనుంచి ఆ మాటకు ఫుల్ స్టాప్ పెట్టకోవాల్సిందే. జరుగుతున్న పరిణామాల్ని చూసి ఇక తాను కూడా మారాల్సిందే అనుకున్నారో.. ఇంకేమో గానీ మొత్తానికి రెడ్లందరికి తానే ఓ ప్రతినిధిలాగా టీడీపీ అధినేత చంద్రబాబును బాగానే పొగిడేశారు జేసీ.
మొత్తం రెడ్ల తరుపున వకాల్తా పుచ్చుకుని మాట్టాడిన జేసీ.. రెడ్లందరూ చంద్రబాబుతోనే నడుస్తారని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు జేసీ. పొగడ్తలు కాదని చెప్తూనే కాస్త డోసు పెంచి మరీ చంద్రబాబును జేసీ పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు కృషి వల్ల రాబోయే రెండేళ్ళలో రాయలసీమ కోనసీమను మించిపోయేలా తయారవుతుందన్నారు. తాను చూసిన సీఎంలు అందరిలోకెల్లా చంద్రబాబే 'ది బెస్ట్' అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు జేసీ.
ఇకపోతే రెడ్ల విషయాన్ని ప్రస్తావిస్తూ.. మా పేర్ల చివర ఉన్న రెడ్డి తోకలు చూసి అనుమాన పడొద్దని, రెడ్లు ఎప్పుడూ మీ వెంటే ఉంటారని చంద్రబాబుకు విన్నవించుకున్నారు. రెడ్లందరి తరుపున చంద్రబాబుకి ఏకగ్రీవ మద్దతు ప్రకటించిన జేసీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేరు చివరన కూడా రెడ్ది ఉందని, దీన్ని చూసైనా రెడ్లంతా చంద్రబాబు వెనకాల నడవడానికి సిద్దంగా ఉన్నారన్న విషయం గమనించాలని చెప్పారు. చివరగా జగన్ గురించి మాట్లాడిన జేసీ, జగన్ వెంట చివరికి మిగిలేది విజయమ్మ ఒక్కరేనని ఎద్దేవా చేశారు.