ఢిల్లీ దీక్షతో ఉపయోగం లేదని బాబుకూ తెలుసు: జేసీ సంచలనం, పవన్ కళ్యాణ్తో పొత్తుపై...
ఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్షలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఏదో ప్రయత్నం చేయాలనే దీక్ష చేస్తున్నారని తెలిపారు. గతంలోను చంద్రబాబు దీక్షలు, ధర్నాలపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరి ఇది తెలుసా: కోడెలకు విజయసాయి రెడ్డి కౌంటర్, 'అసెంబ్లీకి పదేపదే పిలవకండి'
ఢిల్లీలో దీక్షతో ఫలితం ఉండదని చంద్రబాబుకు కూడా తెలుసునని, కానీ ప్రయత్నం వదిలి పెట్టకూడదని అలా చేస్తున్నారన్నారు. యుద్ధం జరుగుతుందని శ్రీకృష్ణుడికి తెలుసునని, అయినను హస్తినకు పోయి రావలె అన్నారని వ్యాఖ్యానించారు. ఇది కూడా అంతే అన్నారు. ఆఖరు నిమిషం వరకు ప్రయత్నం చేయాలనే ఉద్దేశ్యమన్నారు.
పవన్ కళ్యాణ్తో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకునే విషయం తనకు తెలియదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెప్పారు. ఎవరైనా తమతో కలువవచ్చునని, ఎన్నికల నేపథ్యంలో చివరి నిమిషం వరకు ఏదైనా జరగవచ్చునని చెప్పారు. కియా పరిశ్రమను గుజరాత్ తీసుకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నాలు చేశారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వారు అధికారం చెలాయిస్తారని, అమరావతిలో వేసిన రోడ్లు, కట్టిన భవనాలు కూడా తమవిగా బీజేపీ చెప్పుకోవచ్చునని ఎద్దేవా చేశారు. కానీ అది నిజం కాదన్నారు.
కియా మోటర్స్ రాకపై బీజేపీ తప్పుడు ప్రచారం
ఏపీకి కియా మోటార్స్ రాకపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 2015 జనవరిలోనే ఇండియాలో కియా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించిందని చెప్పారు. 2015 ఏప్రిలోలో రాష్ట్ర ప్రతినిధులు కియాతో సంప్రదించారని చెప్పారు.
కియా కోసం ప్రత్యేక పాలసీ
కియా కోసం రాష్ట్రం ప్రత్యేక పాలసీని తీసుకు వచ్చిందని అమర్నాథ్ రెడ్డి చెప్పారు. అసలు ఈ విషయాన్ని బీజేపీ తెలుసుకోలేదని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లాకు నీటిని ఇచ్చి, కియాను తీసుకు వచ్చామని చెప్పారు. ప్రపంచంలో ఎంత వేగంగా ఎక్కడా ఫ్యాక్టరీ రాలేదని చెప్పారు. కియాను ఏపీ నుంచి తరలించాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. కియాను గుజరాత్ రాష్ట్రానికి తీసుకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ చూస్తున్నారన్నారు.