టీడీపీలో 40 శాతం మందిని మారిస్తేనే: బాబుకు జేసీ షాక్, పవన్ కళ్యాణ్-జగన్ కలవరని జోస్యం
Recommended Video
అనంతపురం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిపై ఉన్న కక్షను కేంద్రం రాష్ట్రంపై సాధిస్తోందని ఆరోపించారు.
అలాగే, చంద్రబాబుకు కూడా వచ్చే ఎన్నికల్లో సీట్లపై ఓ సూచన చేశారు. టీడీపీలోని 40 శాతం మంది ఎమ్మెల్యేలను మార్చాలని, అప్పుడే చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఫ్యాక్షనిస్ట్ అని దుమ్మెత్తిపోశారు.
చంద్రబాబు ఏదో అన్నారని మోడీ కక్ష
మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏదో అన్నారని, ఆ కక్షను ఇప్పుడు తీర్చుకుంటున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని హోదాలో ఉండి హుందాగా వ్యవహరించాలన్నారు. మోడీ ఫ్యాక్షనిస్టు మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని, టిట్లీ తుఫాను వస్తే కనీసం ఒక్క మాట మాట్లాడరా, పరిహారం మాటేమిటని నిలదీశారు. అందరూ బతకాలని చంద్రబాబు కోరుకుంటారని, తాను తప్ప ఎవరూ బాగుపడవద్దనేది మోడీ మనస్తత్వం అన్నారు. పోలవరం కట్టేది చంద్రబాబు ఇంటి కోసం కాదన్నారు. రాష్ట్రం కోసం అన్నారు. గుంటూరు వచ్చిన రాజ్నాథ్ సింగ్ శ్రీకాకుళంలో బాధితులను పరామర్శించలేదన్నారు.
దత్తత తీసుకుంటా, థ్యాంక్స్ బాబాయి: పవన్ చెప్పిన మరుసటి రోజే చెర్రీ ప్రకటన, ఉపాసన ట్వీట్
జగన్ సీఎం అయితే నన్ను అరెస్ట్ చేయిస్తారు
జగన్ ముఖ్యమంత్రి అయితే డీజీపీని పిలిచి, ముందువెళ్లి జేసీ దివాకర రెడ్డిని అరెస్ట్ చేసి వచ్చి మాట్లాడు అంటారని, జేసీపై కేసులేం లేవు కదా అని డీజీపీ అంటే గంజాయి కేసు పెట్టయినా అరెస్ట్ చేయమని జగన్ ఆదేశిస్తాడని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ సీఎం అయితే తొలుత అరెస్టయ్యేది తానే అన్నారు. తనకు ఎవరిపై కోపం ఉంటే వారిని జగన్ ఇలాగే అరెస్టు చేయిస్తారని, మోడీలాగే జగన్ది కూడా ఫ్యాక్షన్ మనస్తత్వమని చెప్పారు.
40 శాతం మంది ఎమ్మెల్యేలను మార్చాలి
టీడీపీలోని 35 నుంచి 40 శాతం మంది ఎమ్మెల్యేలను మార్చాలని, అప్పుడు చంద్రబాబును ముఖ్యమంత్రిని కాకుండా ఎవరూ ఆపలేరని జేసీ అన్నారు. ఒత్తిళ్లు, మా వారు, మీ వారు అంటూ వాళ్లను కొనసాగిస్తే చెప్పలేమని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో 35-40 శాతం మందిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో వారిని కనుక మార్చగలిగితే చంద్రబాబు గెలుపును ఆ దేవుడు కూడా అడ్డుకోలేడన్నారు. చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వమని చంద్రబాబును అడుగుతానని, ఇక ఆయన ఇష్టమని చెప్పారు.
జగన్, పవన్ కలిసి పని చేయరు, నా కొడుక్కు టిక్కెట్ అడుగుతా
తానెప్పుడూ ఏ ఎమ్మెల్యేపైనా చంద్రబాబుకు ఫిర్యాదు చేయలేదని జేసీ తెలిపారు. మంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను తెచ్చిపెట్టుకుంటే మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అని చెప్పారు. పవన్ కళ్యాణ్, వైయస్ జగన్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారని, అయితే, వారు నిలబెట్టిన అభ్యర్థులు గెలుస్తారని చెబితే కనుక అది అబద్ధమే అవుతుందని చెప్పారు. జగన్, పవన్ ఇద్దరూ భిన్న ధ్రువాల్లాంటి వారని, వారిద్దరూ కలిసి పనిచేస్తారని అనుకోవడం లేదన్నారు.