చంద్రబాబు గొంతుపై కత్తిపెట్టి.. జగన్ కంటె దుర్మార్గంగానే.. మూడో రకమంటూ జేసీ దివాకర్ రెడ్డి
హైదరాబాద్/అమరావతి: తమ కుటుంబాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే ఆయన.. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారు..
ఓ ప్రముఖ తెలుగు మీడియా ఛానల్తో జేసీ దివాకర్ రెడ్డి తాజాగా మాట్లాడారు. వైఎస్ జగన్ కంటే రెండింతలు చంద్రబాబు ఎక్కువ దుర్మార్గపు పాలన చేయాలని అన్నారు. రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు మళ్లీ ఏపీ సీఎం అవుతారని తామంతా విశ్వాసంగా ఉన్నామని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.
జగన్ కంటే దుర్మార్గంగా చంద్రబాబు పాలన..
చంద్రబాబు మద్దతుదారులమంతా కలిసి ఆయన గొంతు మీద కత్తి పెట్టి చేస్తావా? చెయ్యవా? చెయ్యకపోతే ఎలా అని ప్రశ్నిస్తామని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన దుర్మార్గంగా సాగుతోందని.. అంతకన్నా దుర్మార్గంగా చంద్రబాబు పాలన సాగాలని అన్నారు. తమపై వైసీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
చంద్రబాబు సాత్వికుడంటూ..
అయితే, చంద్రబాబు నాయుడు సాత్వికుడు, దుర్మార్గపు ఆలోచనలు లేనివారని అన్నారు జేసీ దివాకర్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అన్యాయం జరిగింది.. పార్టీ అండ ఉంటుందని చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను జేసీ గుర్తు చేసుకున్నారు. అండ లేదు.. బండలే మా నెత్తిన రాళ్లు పడ్డాయని చెప్పుకొచ్చారు.
అలా చేయకుంటే చంద్రబాబును మూడో రకంగా..
తమను ఇబ్బందులు కలగజేసినవారు, బాధపెట్టినవారిపై కేసులు చూపిస్తాం.. ఏం యాక్షన్ తీసుకుంటావ్.. యాక్షన్ తీసుకోకపోతే చంద్రబాబు నాయకత్వం తమకు ఎందుకు? అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు చాలా మంచివారని.. అయితే ఒకవేళ చంద్రబాబు వారిపై చర్యలు తీసుకోకపోతే.. ఇంకోమాట అంటాం.. ఇదేదో మూడో రకం అనుకోవాల్సి వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే జేసీ సోదరులపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జైలుకు కూడా వెళ్లివచ్చారు. తాజాగా మరోసారి కూడా జేసీ దివాకర్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ర్యాలీగా గుంపులుగా వచ్చారని కేసులు పెట్టారు.