మంత్రి పదవి ఇవ్వడు, దీక్షలు వేస్ట్: వేదికపై బాబుకు జేసీ షాక్, కాంగ్రెస్తో పొత్తుపై సీఎం ట్విస్ట్
కర్నూలు: అనంతపురం పార్లమెంటు సభ్యులు, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి శనివారం కర్నూలులో జరిగిన ధర్మపోరాట దీక్షలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్టీబీసీ మైదానంలో 'నమ్మకద్రోహం - కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం' నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడారు. ఈ దీక్షలు వృథా అని చెప్పడంతో చంద్రబాబు సహా వేదికపై ఉన్న వారు అవాక్కయ్యారని తెలుస్తోంది.
చదవండి: పవన్-లక్ష్మీపార్వతి వ్యాఖ్య: జూ.ఎన్టీఆర్ వస్తే, చంద్రబాబుకు అంతుందా!?
ఆయన ప్రసంగం ప్రారంభంలోనే తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని, మంత్రి పదవి ఇవ్వబోరని తెలిసినా సీఎం చంద్రబాబు గురించి నిజాలు చెప్పడానికి తాను అనంతపురం నుంచి వచ్చానని చెప్పారు. మహాత్మా గాంధీని, సర్ ఆర్థర్కాటన్ను ఎవరూ మర్చిపోరని, అలాగే తెలుగు ప్రజలు చంద్రబాబును ఎప్పటికీ మరిచిపోరన్నారు.
ధర్మపోరాటం వృథా, బీజేపీకి ఓటేసే పరిస్థితి లేదు
చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇస్తాడన్న నమ్మకం లేదని, తనకు పదవులపై కాంక్ష లేదని జేసీ అన్నారు. ఈ ధర్మపోరాట సభలు వృథా అన్నారు. ఇదే విషయాన్ని గతంలో చెప్పానని, ఇప్పుడు చెబుతున్నానని అన్నారు. బీజేపీకి ఓటేసే పరిస్థితి ఎక్కడా లేదని, కాబట్టి మీరు ప్రజల వద్దకు వెళ్లి ధర్మపోరాటం చేస్తూ చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
అప్పుడే చెబితే తొందరొద్దన్నారు
పప్పుబెల్లాలు పెట్టే కేంద్రానికి గుడ్బై చెప్పాలని తాను చంద్రబాబుకు మూడున్నర సంవత్సరాల క్రితమే చెప్పానని, అందుకు ముఖ్యమంత్రి మాత్రం అంత తొందరవద్దు అని చెప్పారని తెలిపారు. చేతికి ఎముక లేదా అన్న తీరులో రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఎవరు ఏది అడిగినా ఇస్తున్నారన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెడితే తనలాంటి రైతు కుటుంబాలు తరతరాలు గుర్తుంచుకుంటాయన్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు తగ్గించి, ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. పథకాలతో లబ్ధి పొందిన వారికి గుర్తుండదన్నారు. వీటన్నింటికంటే నీరు ఇస్తే సరిపోతుందన్నారు.
ఇక్కడున్న వారే చంద్రబాబును తప్పుదోవ పట్టిస్తున్నారు
కొన్ని సందర్భాలలో కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబును తప్పుదోవ పట్టిస్తున్నారని జేసీ వ్యాఖ్యానించారు. అటువంటి వారు ఈ వేదిక పైనే ఉన్నారన్నారు. కేంద్రం చేసిన ద్రోహం ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ దీక్షల వల్ల ప్రయోజనమే లేదన్నారు. కేంద్రంపై ఎన్ని పోరాటాలు చేసినా దున్నపోతుపై వర్షం కురిసినట్లే అన్నారు. మహాత్మా గాంధీ, కాటన్ తర్వాత చంద్రబాబే అన్నారు.
పవన్ కళ్యాణ్, జగన్లపై చంద్రబాబు విమర్శలు
ఆ తర్వాత చంద్రబాబు కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అదే సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పైనా విమర్శలు గుప్పించారు. రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తులు, అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వారు తనను విమర్శిస్తున్నారని పవన్, జగన్లను ఉద్దేశించి అన్నారు. తనపై కుట్రలు చేసేందుకే కొత్త పార్టీలు పెట్టిస్తున్నారని, కొత్త పార్టీని ప్రారంభించినట్లు పేపర్లో చదివానని, కుట్రలతో టీడీపీని బలహీన పర్చలేరన్నారు. జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి బోన్లో నిలబడి వచ్చి మళ్లీ తననే విమర్శిస్తున్నారని, నీతి నిజాయితీలకు మారుపేరు టీడీపీ అని, అవినీతిపరులను విడిచి పెట్టమన్నారు. పవన్కు మొన్నటి వరకు నేను మంచిగా కనిపించానని, కేంద్రం రాష్ట్రానికి రూ.75వేల కోట్లు ఇవ్వాలని, ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి హడావుడి చేసి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని, ఇది లాలూచీ కాదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్తో పొత్తుపై తేల్చేసిన చంద్రబాబు, ట్విస్ట్
కాంగ్రెస్తో టీడీపీ పొత్తు వార్తలపై చంద్రబాబు స్పందించారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టీడీపీ అని, కాంగ్రెస్తో ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసేది లేదన్నారు. విభజనతో కాంగ్రెస్ చేతులు కాల్చుకుందని, ఇప్పుడు బీజేపీకి అదే పరిస్థితి అన్నారు. తాను కాంగ్రెస్తో లాలూచీ పడుతున్నానని ప్రకటనలు ఇచ్చారని, తనకు ఆ అవసరం లేదని, కాంగ్రెస్తో మనకు అన్యాయం జరిగిందనే చెప్పానని, మనకు ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్లని వదిలి తనను విమర్శించే హక్కు ఎవరిచ్చారని విపక్షాలను ప్రశ్నించారు. మన హక్కుల సాధనకు కలసివచ్చే అందరి సహకారం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్తో పొత్తు ఉండదని తేల్చి చెబుతూనే మరోవైపు అందరి సహకారం తీసుకుంటామని ట్విస్ట్ ఇచ్చారు. తద్వారా కాంగ్రెస్ సహకారం తీసుకుంటామని అభిప్రాయపడ్డారు. తనకు పరిపక్వత లేదని, కేసీఆర్కు ఉందని మోడీ మాట్లాడారని, టీడీపీకి ఒక చరిత్ర ఉందని, ఎన్టీఆర్ కాంగ్రెస్ను ఓడించి వీపీ సింగ్ను ప్రధానిని చేశారని, తర్వాత నేను యునైటెడ్ ఫ్రంట్ పెట్టి ఇద్దరిని ప్రధాన మంత్రులను చేశానని, తాను 1994-95లో సీఎంను అయ్యానని, మోడీ 2002లో ముఖ్యమంత్రి అయ్యారని, అదృష్టం కలిసి వచ్చి ఆయన ప్రధాని అయ్యారని, తన పరిపక్వతకు మోడీ సర్టిఫికెట్ అవసరమా అన్నారు.