బాబు మాకు మంత్రి పదవులివ్వరు! పోటీ చేయొద్దని.: జేసీ సంచలనం, ‘జగన్ మా వాడే..’
జేసీ దివాకర్ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే అవుతుంది. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎంపీగా కొనసాగుతున్న ఆయన ఓ టీవీ ఛానల్కు ఇంటర్య్యూలో మాట్లాడుతూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి సంచలనంగా మా
Recommended Video
హైదరాబాద్: జేసీ దివాకర్ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే అవుతుంది. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎంపీగా కొనసాగుతున్న ఆయన ఓ టీవీ ఛానల్కు ఇంటర్య్యూలో మాట్లాడుతూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి సంచలనంగా మారారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పదవులు ఇవ్వరు.. కరివేపాకే, పోటీ చేయొద్దంటారేమో
తనకు గానీ, తన సోదరుడి(జేసీ ప్రభాకర్ రెడ్డి)కి గానీ మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావించడం లేదని, ఆ విషయం తనకు స్పష్టంగా తెలుసునని తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో తమ అన్నదమ్ములను ఎన్నికల్లో పోటీ చేయవద్దని చంద్రబాబు అంటారేమోనన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. కేంద్రంలో తనకుగానీ, రాష్ట్రంలో తన సోదరుడు ప్రభాకర్ రెడ్డికిగానీ మంత్రి పదవులు దక్కే అవకాశం లేదని జేసీ అన్నారు. తమను కూరలో వాడుకుని, ఆపై పక్కన పడేసే కరివేపాకులా చూస్తున్నారని ఆరోపించారు.
ఎన్నడూ కక్కుర్తి పడలేదు
ప్రస్తుతం రాజకీయాలు కలుషితం అయ్యాయని, ఏడుసార్లు ఎన్నికల్లో గెలిచిన తాను ప్రస్తుత పరిస్థితి చూసి చలించి పోతున్నానని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందరూ అవినీతి పరులేనని, తాను మాత్రం అవినీతికి దూరమని చెప్పారు. రాజకీయ నాయకుడిగా కమిషన్లకు ఎన్నడూ కక్కుర్తి పడలేదని స్పష్టం చేశారు. తానెన్నడూ హత్యలు చేయలేదని, చేయించలేదని, ఫ్యాక్షన్ రాజకీయాలకు తాను దూరమని అన్నారు.
నేను ఎంపీగా విఫలమే..
అభివృద్ధికి దూరంగా ఉన్న అనంతపురం నియోజకవర్గాన్ని ముందుకు నడిపించడంలో ఓ ఎంపీగా తాను విఫలం అయ్యానని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో తాను ఎంపీగా కొనసాగడం భావ్యమా? అని సందేహం కలుగుతోందని అన్నారు. తన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని అన్నారు.
మిగితా నాయకుల్లా కాదు..
రాయలసీమలోని ఎన్నో ప్రాంతాలకు నీరు లభిస్తోందని, తాను అడిగిన చాగలమర్రికి మాత్రం నీరు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరిగిందని చెప్పారు. ఈ విషయంలో తాను చంద్రబాబును పలుమార్లు అడిగి విఫలం అయ్యానని అన్నారు. చాగలమర్రికి నీరు కావాలని అడుగుతున్నది తన పొలాల కోసం కాదని, ప్రజల మేలు కోసమేనని జేసీ స్పష్టం చేశారు. నీరు ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని కూడా చంద్రబాబుకు స్పష్టం చేశానని, ఆ తరువాత మాత్రమే కొంత నీరు వచ్చిందని చెప్పారు. మిగతా నాయకులు, ప్రజా ప్రతినిధుల్లా తాను మాటలు చెప్పి పబ్బం గడుపుకోలేనని, అదే తనకు మైనస్ అయిందని అభిప్రాయపడ్డారు. ఇతర నియోజకవర్గాలకు నీరిచ్చి, తనకు నీరివ్వకుండా ఉన్న రోజున తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి రాజీనామాను సమర్పించి వస్తానని స్పష్టం చేశారు.
బాబు ఏమనుకొన్నారో.. నా‘రాజీనామా'తో కొంత న్యాయం
తన హెచ్చరికలను చంద్రబాబు లైట్గా తీసుకున్నారో లేదా సీరియస్గా ఆలోచిస్తున్నారో అన్న విషయం తనకు తెలియదని చెప్పారు. ‘నేను రాజీనామా చేస్తానని చెప్పడం సంచలనమైందో, వంచలనమైందో నాకు తెలియదు. ప్రభుత్వం దిగివచ్చిందని నేను ఎందుకు అనుకోవాలి? కొంత న్యాయం చేసిందని చెప్పగలను' అని జేసీ వివరించారు.
జగన్ మా వాడే..
ఓ రాజకీయ పార్టీ నేతగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాలను తాను విభేదించినప్పటికీ, జగన్ తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకడేనని, ఆయన కుటుంబం తనకెంతో దగ్గరని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ను తాను వాడు, వీడు అని సంబోధిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
జగనే కాదు.. జ్యోతిలక్ష్మి వచ్చినా..
జగన్ చేస్తున్న పాదయాత్రతో ఆయన బలం పెరిగిందని భావించాల్సిన అవసరం లేదని, రోడ్డుపై జ్యోతిలక్ష్మి నడుస్తున్నా చూసేందుకు ప్రజలు వస్తారని ఎద్దేవా చేశారు.
అనంతపురంలో తనను అడ్డుకునేందుకు ఎన్నో దుష్ట శక్తులు అడుగడుగునా వెంటాడుతున్నాయని, వాటిల్లో అధికార పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారని, తాను మాత్రం వారి కోరలు పీకేసి తన దారిన తాను వెళుతుంటానని చెప్పారు. ప్రజల్లో చెడు అభిప్రాయాన్ని తెచ్చుకునేందుకు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రహదారి విస్తరణ పనుల వల్ల ఆయనకు నష్టం జరగదని, ఇంకా చెప్పాలంటే లాభమే కలుగుతుందని అన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా పోవడం ప్రభాకర్ దురదృష్టమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా కలుషిత రాజకీయాలే నడుస్తున్నాయని జేసీ అభిప్రాయపడ్డారు. గతంలో ఉన్న నేతల్లో ఉన్న నిజాయితీ ప్రస్తుత నేతల్లో లేదని జేసీ అన్నారు. గెలిపించిన సొంత ప్రజలకు కూడా నేతుల దూరంగా ఉంటూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.