బాబుపై కోపం ఉంటే చంపేయ్.. రాజధాని రైతులను ఇబ్బంది పెట్టొద్దు: జేసీ దివాకర్ రెడ్డి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశం అగ్గిరాజేస్తోంది. ఇప్పటికే అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇక అమరావతిలో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయులు కూడా రైతులకు మద్దతు తెలిపి షాక్ ఇచ్చారు. తాజాగా రాజధాని రైతులు నిరసన తెలుపుతున్న శిబిరాన్ని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సందర్శించారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన నిరసన తెలుపుతున్న రైతుల శిబిరాన్ని సందర్శించి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
చంద్రబాబు పై కోపం ఉంటే చంపేయ్...
రాజధాని కోసం రైతులు నిరసనలు చేపడుతుంటే అవేమీ ముఖ్యమంత్రి జగన్కు పట్టడం లేదని మండిపడ్డారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. చంద్రబాబుపై కోపంతో ఇంతమంది ఉసురు పోసుకుంటావా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై కోపం ఉంటే అతన్ని చంపేయాలని ముక్కలు ముక్కలు చేయాలని అన్న జేసీ... అమరావతి ప్రాంత రైతులను దెబ్బతీయొద్దని సీఎం జగన్కు చెప్పారు. అంతేకాదు తనపై వ్యక్తిగతంగా ఉంటే తమను నాశనం చేయాలి తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించరాదని సూచించారు.
మెదడు లాంటి సెక్రటేరియట్ను ఎలా వేరు చేస్తారు..?
ఆరోజు తన మాటకు ఎదురు చెప్పి జగన్ వెంట నడిచినందుకు ఇబ్బందులు పడుతున్నట్లు రెడ్డి సామాజిక వర్గంవారు తనతో చెబుతున్నారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇష్టా ఇష్టాలు అందరికుంటాయన్న జేసీ.. సీఎం తన స్థాయి మరిచి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. స్థాయికి తగ్గట్టుగా సీఎం వ్యవహరించడం నేర్చుకోవాలని చెప్పారు. సీఎం జగన్ తనకు మాత్రమే తెలివి ఉందని అనుకుంటున్నారని చెప్పిన జేసీ... సెక్రటేరియట్ రాష్ట్ర రాజధానికి మెదడు లాంటిదన్నారు. ఆ మెదడులాంటి సెక్రటేరియట్ను అమరావతిలోనే ఉంచి మిగతాది తాను ఎక్కడ పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. రాయలసీమకు హైకోర్టు తీసుకురావడం వల్ల తమకెలాంటి లాభం ఒనగూరదని జేసీ దివాకర్ రెడ్డి పునరుద్ఘాటించారు.
జగన్ మంచి పేరు తెచ్చుకోవాలి...
తన తండ్రి మరణించిన తర్వాత కూడా ప్రజలు తలచుకుంటున్నారని అలా పదికాలాల పాటు ప్రజల మనసుల్లో నిలిచేందుకు సీఎం జగన్ ప్రయత్నించాలని చెప్పారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు నాయుడు రెడ్డి డామినేషన్ ఏరియా అయిన అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ను తీసుకొచ్చారని చెప్పడంతో శిబిరంలో చప్పట్లు మోగాయి. జగన్కు దేవుడంటే భయం లేదు, అమ్మ అంటే భయం లేదు, చెల్లెలంటే అప్యాయత లేదని జేసీ అన్నారు.
బాబు విజన్ ఉన్న నాయకుడు
చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని జేసీ కొనియాడారు. రాష్ట్రపతి భవన్ ఉండేది కొన్ని ఎకరాలే అని, పార్లమెంటు కూడా కొన్ని ఎకరాల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించిన జేసీ... ఆ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కలలు కన్నారని చెప్పారు. అందుకే భూసేకరణ చేశారని వెల్లడించారు తప్పితే భూమిపై ఆశతో కాదని స్పష్టం చేశారు.