దేవుడి దయపైనే: పోలవరంపై జెసి సంచలన ప్రకటన
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై జెసి దివాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. 218 నాటికి అది పూర్తి కావడమనేది దేవుడి దయపై ఆధారడి ఉందని ఆయన అన్నారు.
పోలవరం: గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను జేసీ పరిశీలించిన తర్వాత ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
సంక్లిష్టమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనే విషయం భగవంతుడి దయపై ఆధారపడి ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి 2018 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, ప్రజల గుండెల్లో నిలిచిపోవాలనే సంకల్పంతో ఉన్నారని చెప్పారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసేందుకు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే కృషి చేస్తున్నారని, ఆయనకు ఎమ్మెల్యేలు, ఎంపీలు సహకరించడం లేదని ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అంతకు ముందు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించేందుకు వెళుతూ పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఆగిన ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళేలా ప్రజాప్రతినిధులు ముఖ్య భూమిక పోషించాలని అన్నారు. ముఖ్యంగా పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందన్నారు.
రైతు రుణమాఫీని తక్కువ మొత్తం చేసైనా ఒకేసారి చేయాల్సిందిగా తాను చంద్రబాబుకు సూచించానన్నారు. అయినా రైతులకు నమ్మకాన్ని కలిగించేందుకు రూ.లక్షన్నరను దఫదఫాలుగా చేస్తానని రైతులకు భరోసా కలిగించారని వివరించారు. నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతోందని జెసి అన్నారు.