నా మాట వింటే సంకనాకిపోయేవారు, చంద్రబాబులో లోపం అదే: జేసీ
విశాఖపట్నం: రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న దురాలోచనతోనే సోనియా గాంధీ ఏపీని విభజించారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బుధవారం విమర్శించారు. రైల్వే జోన్ కోసం విశాఖలో టీడీపీ ఎంపీలు చేపట్టిన ఒక్కరోజు నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వాల పాలన బ్రిటిష్ పాలన కంటే దారుణంగా ఉందన్నారు.
Recommended Video
ప్రజలందరికీ ఆర్థిక స్వాతంత్ర్యం రావాలని చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. పెద్దలను గౌరవించడం తెలియని వ్యక్తి వైసీపీ అధినేత జగన్ అన్నారు. అయిదేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. సీఎంగా చంద్రబాబు కొనసాగితేనే రాయలసీమ అభివృద్ధి జరుగుతుందన్నారు.
పవన్కు దాడి షాకిచ్చారా?: చంద్రబాబూ! మీఅద్భుతాలు చాలు, మోడీకి చెప్పగా విన్నాను
చంద్రబాబు డిఫెక్ట్ ఇదే
నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి పోలవరం పేరు వింటున్నానని, ఇప్పుడు చంద్రబాబు వల్ల ఆ కల సాకారమవుతోందని జేసీ అన్నారు. చంద్రబాబు మూలవిరాట్ లాంటివాడన్నారు. టీడీపీ కార్యకర్తలంతా భక్తులు ఉన్నారు. నేను పూజారిలాంటి వాడినన్నారు. కానీ ఇక్కడ పూజారులు సరిగా లేరన్నారు. చంద్రబాబులో ఉన్న డిఫెక్ట్ అదే అన్నారు. తద్వారా చంద్రబాబు చుట్టూ ఉన్న వారు బాగా లేరని అభిప్రాయపడ్డారు. పూజారులు సరిగా లేరన్నారు. పూజారులను సరిగా ఉండాలన్నారు. పూజారులు సరిగా లేకుంటే నైవేద్యం అమ్మేస్తారన్నారు. పూజారులు గంట కొట్టేవారేనని, కానీ చంద్రబాబు మూలవిరాట్ అని, అలాంటి వాడిని చూసి ఓటు వేయాలన్నారు.
చంద్రబాబు నామాట వింటే సంకనాకిపోయేవారు
ఏపీ ప్రయోజనాల విషయంలో చంద్రబాబు పదేపదే కడవరకు చూద్దామని చెప్పారని, ఆయనకు అంత ఓపిక ఉన్నందువల్లే ఆ మాత్రం పోలవరం ప్రాజెక్టు కనిపిస్తోందని జేసీ అన్నారు. బీజేపీతో కలిసి సాగవద్దనే తన మాట విని ఉంటే ఇవాళ సంకనాకి పోలవరం గోదావరిలో మునిగిపోయేదన్నారు. దటీజ్ చంద్రబాబు అన్నారు. ఉండాల్సిన చోట కోపం ఉందన్నారు. ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండే వ్యక్తి అన్నారు.
సాయిబాబాలా మహత్యాలు ఉన్నాయా?
మా సాయిబాబాకు (పుట్టపర్తి సాయిబాబా) కొన్ని మహత్యాలు ఉండేవని, ఈ పెద్దమనిషి యనమల రామకృష్ణుడు కూడా ఇలా చేతులు తిప్పితే ఏమైనా డబ్బులు వస్తున్నాయా అనే అనుమానం తనకు వస్తుందని జేసీ అన్నారు. విభజన సమయంలో జీతాలు ఇవ్వలేని స్థితి నుంచి ఇప్పుడు ఎంతో స్థాయికి ఎదిగామన్నారు. చంద్రన్న బీమా వల్ల నా సొంత ఊళ్లో ఏడెనిమిది మందికి రూ.5 లక్షలు వచ్చాయన్నారు. పూర్వంలో అక్షయపాత్ర అని కథల్లో విన్నామని, ఇప్పుడు యనమల వద్ద అలాంటిది ఉందా అన్నారు.
మోడీకి చంద్రబాబు కొంత వంగి షేక్ హ్యాండ్ ఇస్తే తప్పా
ప్రధాని మోడీకి చంద్రబాబు షేక్ హ్యాండ్ ఇస్తే వైసీపీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని జేసీ అన్నారు. దానిని కూడా రాద్దాంతం చేస్తారా, రాజకీయం చేస్తారా అన్నారు. మనం అవునన్నా, కాదన్నా మోడీ ప్రధానమంత్రి అని, కాబట్టి ఆయనకు గౌరవం ఇవ్వాలని, అందుకే చంద్రబాబు కొంత వంగి నమస్కరించారని జేసీ అభిప్రాయపడ్డారు. అందులే తప్పేముందన్నారు. 25 ఎంపీ సీట్లు, 170 అసెంబ్లీ సీట్లు ఇచ్చాక చంద్రబాబుకు ఎలివేషన్ ఇవ్వాలన్నారు. చంద్రబాబు వంటి సీనియర్ నేత లేరన్నారు. రాజనీతిజ్ఞుడు అన్నారు.
రెండేళ్లలో కోనసీమలా రాయలసీమ
చంద్రబాబు అపరచాణక్యుడు అని, ఆయనకు మంత్రాలు, తంత్రాలు అన్నీ తెలుసునని, ఆయనకు తెలియనిది లేదని జేసీ అన్నారు. ఎన్నిమార్లు మోడీ పేరు ఎత్తినా లాభం ఉండదని తాను చంద్రబాబుకు గతంలోనే చెప్పానని అన్నారు. ఏపీలో బీజేపీకి ఓటేసే వారు లేరని, టీడీపీ పుణ్యంతో 5 అసెంబ్లీ, 2 లోకసభ సీట్లు వచ్చాయన్నారు. నేటి తరం కంటే రేపటి తరం బాగుంటే అంతకంటే సంతోషం లేదన్నారు. మరో అయిదేళ్లు టీడీపీ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబుల వల్లే అనంతపురంలో వరిసాగు సాగుతోందన్నారు. రెండేళ్లలో కోనసీమను తలదన్నేలా రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు.