నేతల ఆగ్రహం: జేసీ దివాకర్ రెడ్డి యూటర్న్, 'గాలి జనార్ధన్-జగన్ల కోసమే ఈ కుట్ర'
అమరావతి: కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎంపీ సీఎం రమేష్ ప్రయత్నం చేస్తున్నాడని, అతను వంద శాతం విజయం సాధిస్తాడని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రెండు రోజుల ముందు ఆయన దీక్షకు మద్దతు తెలిపిన జేసీ మాట్లాడుతూ.. ఈ దీక్ష వల్ల ఒరిగేదేమీ లేదని, దీంతో స్టీల్ ప్లాంట్ రాదని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి సహా పలువురు మండిపడ్డారు.
Recommended Video
దీంతో జేసీ దివాకర్ రెడ్డి తగ్గినట్లుగా కనిపిస్తోంది. శనివారం ఆయన మాట్లాడుతూ.. సీఎం రమేష్ విజయం సాధిస్తారన్నారు. సమస్య తీవ్రతను కేంద్రానికి తెలియజేసేందుకు దీక్షలు చేయాల్సిందే అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తీరు దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉందన్నారు. ఆయన ఏమాత్రం స్పందించడం లేదన్నారు.
నేనేం చెప్పానంటే.. జేసీ
ఇలాంటి సమయంలో దీక్షలు చేస్తే ఆరోగ్యం చెడిపోతుందని మాత్రమే సీఎం రమేష్కు చెప్పానని జేసి దీవాకర్ రెడ్డి అన్నారు. కానీ తాను దీక్షలు చేయవద్దని అనలేదన్నారు. ఏసీబీ పేరు చెప్పి కొందరు.. అధికారులను, ఉద్యోగులను బెదిరిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు పని చేయడం కష్టంగా మారిందన్నారు. ప్రజాప్రతినిధులు సైతం అధికారులను భయపెడుతున్నారని, ఇది సరికాదన్నారు. దీక్ష వల్ల ఉక్కు పరిశ్రమ ప్రాధాన్యత ప్రజలకు తెలియజేయవచ్చునని చెప్పారు.
సానుకూలంగా స్పందించింది, కానీ
ఇదిలా ఉండగా, దీక్ష చేస్తున్న సీఎం రమేష్ కేంద్రం తీరుపై బహిరంగ లేఖ రాశారు.ఓబుళాపురం గనుల్లో గాలి జనార్దన్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్లకు లబ్ధి చేకూర్చేందుకు కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రం వెనక్కి తగ్గిందని ఆరోపించారు. గత ఏడాది తమ పార్టీ ఎంపీ టీజీ వెంకటేశ్తో కలిసి తాను రాజ్యసభలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు కేంద్రం సానుకూలంగానే స్పందించిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ, వైసీపీలు కలిసి ఆడుతున్న ఈ వికృత క్రీడలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
కక్ష సాధింపు చర్య
కేంద్రం వైఖరిపై జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని సీఎం రమేష్ ప్రశ్నించారు. సుమారు యాభై ఏళ్ల క్రితం జరిగిన విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించినట్లే, ప్రస్తుతం కడప ఉక్కు కర్మాగారం కోసం జరుగుతున్న ఉద్యమం అదే ప్రభావం చూపనుందన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం కడపలో ఉందని మెకాన్ కమిటీ నివేదిక ఇచ్చినా పరిశ్రమ నెలకొల్పడం సాధ్యం కాదనడం తెలుగుజాతిపై కక్ష సాధింపు చర్యలకు దిగడమే అన్నారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా
గత ఏడాది జూన్ 12న దీనిపై కేంద్రం వివరణ అడిగితే రాష్ట్రం ఇవ్వలేదని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రమేష్ మండిపడ్డారు. ఆరుసార్లు జరిగిన టాస్క్ఫోర్స్ సమావేశాల్లో వారు అడిగిన ప్రతి అంశానికి ఆంధ్రప్రదేశ్ సమాధానం ఇచ్చిందన్నారు. దురుద్దేశంతో క్లారిఫికేషన్ పేరిట నాలుగేళ్లు కాలయాపన చేసి మోసం చేశారన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో టీడీపీ రాజీపడదని చెప్పారు.