బాబు వద్దకు పంచాయతీ: పట్టు కోసం జేసీ, బెట్టు కోసం ప్రభాకర్, అసలేం జరిగింది?
అనంతపురం జిల్లాలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య రోడ్ల యుద్ధం వేడెక్కింది. ఇది జేసీ దీక్ష నుంచి ప్రభాకర చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది.
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య రోడ్ల యుద్ధం వేడెక్కింది. ఇది జేసీ దీక్ష నుంచి ప్రభాకర చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది.
సోమవారం జేసీ దివాకర్ రెడ్డి నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. సాయంత్రం పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి, ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీనిపై టీడీపీ నాయకత్వం తీవ్రంగా పరిగణించిందని తెలుస్తోంది.
కాళ్లు పట్టుకుంటా, జుత్తూ పట్టుకుంటా.. జేసీ సంచలనం, దీక్ష భగ్నం
మొత్తానికి ఈ పంచాయతి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది. ఎమ్మెల్యే ప్రభాకర చౌదరిని, కలెక్టర్ కోన శశిధర్ను విజయవాడకు రావాలని సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ప్రభాకర చౌదరి.. చంద్రబాబు మంగళవారం కలిశారు. మరోవైపు, దీక్ష కారణంగా జేసీ దివాకర్ రెడ్డి షుగర్ నిల్వలు పడిపోయాయని వైద్యులు చెప్పడంతో ఆయనను హైదరాబాదుకు తరలించారు.
ఏం జరిగింది?
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం ఇద్దరు పని చేశారని, ఇప్పుడు విభేదాలు వచ్చాయని అంటున్నారు. అధికార టిడిపి శ్రేణులు రెండుగా చీలిపోయాయి. 2014లోనే కాంగ్రెస్ నేతలైన గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రషీద్ అహ్మద్, వైసిపి నాయకుడు మాసుం బాబాను టీడీపీలో చేర్చుకునేందుకు ఎమ్మెల్యే స్థానిక లలిత కళాపరిషత్లో సభ ఏర్పాటు చేశారు.
ఆ కార్యక్రమానికి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి హాజరయ్యారు. మొన్నటిదాకా టీడీపీ విజయానికి అడ్డుగా మారిన కాంగ్రెస్ నాయకులను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరమేమొచ్చిందని నిలదీశారు. దీంతో వారి చేరికలు ఆగిపోయాయి. ఈ సంఘటన తర్వాత ప్రభాకర్ చౌదరి క్రమంగా జేసీ సోదరులకు దూరమయ్యారు.
జేసీ తన లోకసభ నియోజకవర్గ పరిధిలోని తాడిపత్రి, కల్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి పట్టణాల్లో రోడ్ల వెడల్పునకు శ్రీకారం చుట్టారు. తర్వాత అనంతపురం నగరంపై దృష్టి సారించారు. నిత్యం రద్దీగా ఉండే తిలక్ రోడ్, గాంధీ బజారులో రోడ్ల వెడల్పు చేయించాలని నిర్ణయించారు.
ఆగస్టు 8న తిలక్ రోడ్డు విస్తరణ, పరిహారానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది. నిధులు మంజూరు చేసింది. ఆ తర్వాత గాంధీ బజారు విస్తరణ, పరిహారానికి సంబంధించి జీవో జారీ అయింది. నిధులు మంజూరు చేసింది. అయితే, ఆ రోడ్లు వెడల్పు చేయబోమని, తాను అండగా ఉంటానని ప్రభాకర చౌదరి గత ఎన్నికల్లో వ్యాపారులకు హామీ ఇచ్చారు. అందుకు విరుద్ధంగా జేసీ చేస్తున్న ప్రయత్నాలతో వారిద్దరి మధ్య దూరం బాగా పెరిగింది.
విభేదాల నేపథ్యంలో అనంతపురం పైన పట్టు కోసం ఇరువర్గాలు ప్రయత్నిస్తున్నాయి. జేసీ సోదరులు పట్టు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డి గత కొద్ది రోజులుగా మకాం వేశారు. పారిశుధ్ధ్య కార్యక్రమాలను చేపట్టారు.
నగరంలోని అతిపెద్ద మురుగు కాలువైన మరువవంక శుభ్రత కోసం జేసీ సొంత నిధులు కూడా వెచ్చించారట. ఈ పనుల్లో స్థానిక ఎమ్మెల్యేను భాగస్వామిని చేయలేదని అంటున్నారు. ఇదే సమయంలో రోడ్ల వెడల్పును అడ్డుకునే దిశగా బాధితులు కోర్టులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జేసీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట దీక్షకు దిగారు.