ఇదే తన మాట.. ! తన మాటే తన శత్రువు..!!
Recommended Video
తరుచూ నిర్మొహమాటంగా మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో ఉండే టీడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కష్టాలు కొని తెచ్చుకున్నారు. తన పర బేదం లేకుండా జేసీ దివాకర్ రెడ్డి చేసే వాఖ్యలు సొంత పార్టీ నేతలనే కాకుండా అప్పుడప్పుడు పార్టీ అదినేత చంద్రబాబును కూడా ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. కొన్ని సందర్బాల్లో పార్టీ నేతలను జేసీ వాఖ్యలు అసహనానికి కూడా గురిచేస్తుండం గమనార్హం. దీంతో జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారం పట్ల జాగ్రత్తగా ఉండాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. నిన్నటికి నిన్న పార్టమెంట్ వర్షాకాల సమావేశల సందర్బంగా జేసి దివాకర్ రెడ్డి అలకపాన్పునుండి తీసుకొచ్చి పార్లమెంట్ కు పంపించడం కూడా టీడిపి కి చాలా 'ఖర్చు' తోనే కాకుండా తలనొప్పితో కూడుకున్నపనిగా పరిణమించింది. తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం ఎంత కాలం ప్రయాసపడుతామని టీడిపి అదిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చే అంశం పై టీడిపి సంకోచిస్తునట్టు సమాచారం.
నరం లేని నాలుక... జేసీని నట్టేట ముంచుతోంది..
అనంతపురం ఎంపి జెసి దివాకర రెడ్డికి టిక్కెట్ చిక్కులు వచ్చిపడ్డాయి. తెలుగుదేశం అధినాయకత్వానికి సమస్యగా మారిన జెసికి ఈ సారి టిక్కెట్ ఇవ్వటం లేదనే ప్రచారం ఊపందుకుంది. కొంత కాలంగా జెసి వ్యవహార శైలే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆయన తన డిమాండ్ల కోసం టిడిపి ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారనే అభిప్రాయం వెల్లడవుతోంది. ఆమధ్య అనంతపురం జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి వచ్చినా జెసి ఆ కార్యక్రమంలో పాల్గొన లేదు. దీంతో జెసి వ్యవహార శైలి పై టిడిపి హైకమాండ్ అసహనంతో ఉందని తెలుస్తోంది.ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోకుండా వేచిచూసే ధోరణిలో అవలంబించాలని టీడిపి భవిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జేసీకి టిక్కెట్ నిరాకరించటమే అన్ని సమస్యలను పరిష్కారంగా టీడీపీ భావిస్తున్నట్లు పక్కా సమాచారం.
సెంకండ్ పవర్ స్టేషన్ గా జేసి ప్రయత్నాలు.. కత్తిరించే పనిలో టీడిపి..
టిడిపి ఎంపీగా గెలిచినప్పటి నుండి జిల్లాలో అధిపత్యం కోసం జెసి ప్రయత్నిస్తున్నరని తెలుస్తోంది. ఇందులో భాగంగా టిడిపిలో తన వర్గాన్ని పెంచుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి తో ఉన్న విబేధాల నేపధ్యంలో ఆయన తన అనుయాయులకు పార్టీలో ప్రాధాన్యత కోసం హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబుకు గాని, లోకేష్ గాని సమాచారం లేకుండా ఆమధ్య అనంతపురం అర్బన్లో వైసిపి నుండి గుర్నాధరెడ్డిని టిడిపి లోకి తీసుకొచ్చారు జెసి. అంతే కాకుండా నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ కూడా ఇచ్చారట. అయితే, ఇప్పటి వరకు తనకు నామినేటెడ్ పదవి ఇవ్వకపోవటంతో గుర్నాధరెడ్డి తాను పార్టీ మారుతానని చెబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, గుంతకల్ మాజీ ఎమ్మెల్యే మధు సూధన గుప్తాను టిడిపిలోకి తీసుకొచ్చేందుకు జెసి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
సమయం చూసి జేసీ అలక.. అలక వీడేందుకు ఓ మెలిక..
అదే విధంగా నిధుల విడుదల విషయంలోనూ జెసి తాను అనుకున్న విధంగా పార్టీ పై ఒత్తిడి తెస్తున్నారు. ఇన్ని చేస్తున్నా పార్టీలో జెసి మాట చెల్లుబాటు కావటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, దీంతో తాను రాజీనామా చేస్తానంటూ డెడ్లైన్లు పెడుతూ జెసి మరో రాజకీయానికి తెరలేపుతున్నారని భావన వ్యక్తం అవుతోంది. ఇది జిల్లాలో పార్టీపై ప్రభావం చూపుతోంది. దీని పై పార్టీ అధ్యక్షుడికి సైతం ఫిర్యాదులు వెళ్లాయని తెలుస్తోంది. మరోవైపు అనంతపురం వర్గ విబేధాల పై ముఖ్యమంత్రి ఇప్పటికే పలుమార్లు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్ఙితుల పై హెచ్చిరికలు చేసారు. అయినా జేసీ వైఖరిలో మార్పురాలేదనే ఆరోపణలున్నాయి. దీనికితోడు రాయదుర్గం సీటు పైనా తన మాట చెల్లుబాటు అయ్యేలా జెసి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక చాలు.. భరించడం కష్టం.. వచ్చే ఎన్నికల్లో వేటే..!!
జిల్లాలోని కొన్ని సీట్లలో తన ప్రభావం ఉండే విధంగా జెసి చేస్తున్న రాజకీయాలు జిల్లా పార్టీ నేతల్లో ఆగ్రహాన్ని రేపుతున్నాయి. అయితే ఇప్పుడు జేసీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది మరిన్ని సమస్యలు తెచ్చి పెడుతుందని పార్టీ అదిష్టానం భావిస్తోందట! అందుకే వచ్చే ఎన్నికల్లో జెసికి టిక్కెట్ ఇవ్వకుండా ఉండటమే మంచిదని అనుకుంటోందని రాజకీయవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అందుకే ఎప్పుడు, ఎక్కడ,ఎలా, ఎందుకు, ఏం మాట్లాడలో తెలియకుండా నోటికి పని చెప్తే ఫలితం ఇలాగే ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది.