బూట్లు నాకే సంస్కృతి జేసీదే..కుక్కల వ్యాన్ లో ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించాలి : పోలీస్ అధికారుల సంఘం
పోలీసులను అవమానించేలా జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ లో దుమారం రేపుతున్నాయి. జెసి వ్యాఖ్యలపై పోలీసులు తీవ్రంగా మండి పడుతూ ఉంటే తాను చేసిన వ్యాఖ్యలను జెసి దివాకర్ రెడ్డి సమర్థించుకుంటున్నారు. కొంతమంది వరస్ట్ పోలీసులను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టు దానికి తాను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
జేసీపై క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలన్న పోలీసు అధికారుల సంఘం
ఇక ఏపీ పోలీసులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు జెసి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులది బూట్లు నాకే సంస్కృతి కాదని, రాజకీయాల్లో ఆ స్థాయికి రావడానికి జేసీ ఎవరి బూట్లు నాకారో చెప్పాలన్నారు.
తాము టీడీపీ బానిసలం కాదన్న పోలీసులు
టీడీపీ నేతలు పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారని పోలీసు అధికారుల సంఘం మండిపడింది . వేదికపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయనను వారించకపోవటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేసింది. బూట్లు తుడిచేందుకు తాము టీడీపీ బానిసలం కాదని, బుల్లెట్లు ప్రయోగించటంలో శిక్షణ పొందిన ప్రజాసేవకులం అని పేర్కొంది. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని , లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని పోలీస్ అధికారుల సంఘం హెచ్చరించింది. జేసీ దివాకర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పోలీసుల సంఘం డిమాండ్ చేసింది.
జేసీ ఒక జోకర్ .. గన్ మెన్లు లేకుండా బయటకు రా అని సవాల్ చేసిన పోలీసులు
చంద్రబాబు సమక్షంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు నవ్వడం సిగ్గుచేటని, జెసి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. జెసి దివాకర్ రెడ్డి జోకర్ లా మాట్లాడుతున్నాడని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో అందరూ ఆయనను అలానే చూస్తున్నారని, గన్ మెన్లు లేకుండా ధైర్యం ఉంటే బయటికి రమ్మని వారు సవాల్ చేస్తున్నారు. జేసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలపై చిత్తూరు జిల్లా పోలీసు సంక్షేమ సంఘం కూడా స్పందించింది.
పిచ్చికుక్కల వ్యాన్ లో ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని ఫైర్
జెసి దివాకర్ రెడ్డి పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నారని, ఆయనకు గొలుసులు వేసి కుక్కల వ్యాన్లో ఎక్కించి ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించాలని చిత్తూరు జిల్లా పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. మాజీ ఎంపీ జేసీ పై కేసులు నమోదు చేయిస్తామని, ఆయన ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అని వారు డిమాండ్ చేశారు. జెసి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి లో చేర్పించాలని పోలీసు అధికారుల సంఘం , పోలీసు సంక్షేమ సంఘం జెసి కుటుంబ సభ్యులకు సూచిస్తోంది.