పోలీసా.. మజాకా... డీఎస్పీ వార్నింగ్.. జేసీ అరెస్ట్... విడుదలైన 24గంటలకే...
జైలు నుంచి విడుదలై కాగానే మరో వివాదాన్ని కొని తెచ్చుకున్న జేసీ ప్రభాకర రెడ్డిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అనంతపురం డీఎస్పీ శ్రీనివాసులు జేసీ తీరును తీవ్రంగా ఖండించారు. పోలీసులపై జులుం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే చట్టపరంగా తగిన బుద్ది చెప్పుతామన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని... అంతా చట్ట ప్రకారం నడుచుకోవాల్సిందేనని సూచించారు. డీఎస్పీ వార్నింగ్ ఇచ్చిన కొద్ది గంటలకే జేసీ మళ్లీ అరెస్టవడం గమనార్హం.
జైలు నుంచి విడుదలవుతున్న సందర్భంలో ఎలాంటి ర్యాలీలు చేపట్టకూడదని ఒకరోజు ముందే జేసీ కుటుంబానికి చెప్పామని డీఎస్పీ అన్నారు. జేసీ వర్గీయులు మాత్రం తమ మాటలను పెడ చెవిన పెట్టారన్నారు. జేసీ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని మండిపడ్డారు. సీఐ దేవేంద్ర పట్ల కూడా జేసీ దురుసుగా ప్రవర్తించారని,సీఐ ఫిర్యాదు మేరకు జేసీపై అట్రాసిటీ కేసు నమోదైందని తెలిపారు. కోవిడ్ 19 నిబంధనలకు విరుద్దంగా జేసీ 500 మందితో ఊరేగింపు చేపట్టడంతో పాటు బాణసంచా కాల్చారని డీఎస్పీ అన్నారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ తమ వద్ద ఉన్నాయని... ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు తీసుకున్నాకే జేసీపై ఐదు కేసులు నమోదు చేశామని అన్నారు.
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయి జైలుకెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి,ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి గురువారం(అగస్టు 6) కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనుచరులతో కలిసి ఆయన తాడిపత్రికి ఊరేగింపుగా వెళ్లారు. అయితే తాడిపత్రి బొందలదిన్నె వద్ద జేసీ కాన్వాయ్ని సీఐ దేవేంద్ర అడ్డుకుని అభ్యంతరం చెప్పారు. కరోనా నేపథ్యంలో ఊరేగింపులు సరికాదని చెప్పారు. దీంతో జేసీ సీఐని దూషించారు.
సీఐ దేవేంద్ర ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి మరోసారి అరెస్టయ్యారు. విడుదలైన 24గంటల్లోపే జేసీ,ఆయన తనయుడు అరెస్టవడం చర్చనీయాంశంగా మారింది.