అట్రాసిటీ కేసు: పోలీసు కస్టడీలోకి జేసీ ప్రభాకర్ రెడ్డి
అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకున్నారు. తాడిపత్రికి సమీపంలోని జమ్ములదిన్నెలో సీఐ దేవేందర్పై జేసీ ప్రభాకర్ రెడ్డి దూర్భాషలాడారనే ఆరోపణలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో కడప జైలులో రిమాండ్లో ఉన్న ప్రభాకర్ రెడ్డిని ఆదివారం ఉదయం పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత మూడో పట్టణ పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు.
తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు.. ప్రభాకర్ రెడ్డిని విచారిస్తున్నారు. విచారణ అనంతరం ఆదివారం సాయంత్రం 5 గంటలలోపు కడప జైలుకు తరలించనున్నారు. కాగా, అంతకుముందు ఆగస్టు 6న వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ అభియోగం బెయిల్పై విడుదలై తాడిపత్రికి వచ్చే సమయంలో బొందలగిన్నె వద్ద సీఐ దేవేంద్ర కుమార్తో జేసీ వాగ్వాదానికి దిగారు.
కులం పేరుతో సీఐని జేసీ దూషించారనే ఆరోపణలపై ఆయనపై తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు వాహనాలు అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
ఇది ఇలావుంటే, వాహనాల ట్యాంపరింగ్, అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి బెయిల్పై విడుదల అయిన సందర్భంగా వారి అనుచరులు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరారు. అనుచరులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి వాహనాలతో ర్యాలీగా అనంతపురం బయల్దేరారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వాగ్వాదం చోటు చేసుకుంది.