వైయస్ను జగనే చంపించారు, మమ్మల్నీ..: జేసీ సంచలనం, కొడుకుతో సహా అరెస్ట్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్న తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని జగనే చంపించాడని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం కన్న తండ్రినే చంపేశాడని అన్నారు.
కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు తమను కాపాడుతున్నారంటూ జగన్ ఆరోపిస్తున్నారని... సీఎం తమను ఎలా కాపాడుతున్నారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలోని సాక్షి కార్యాలయం ముందు ఆయన ధర్నాకు దిగారు.
రోడ్డు ప్రమాదం దురదృష్టం..
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబం గత కొన్నేళ్లుగా రవాణారంగంపై ఆధారపడి ఉందన్నారు. న్యాయబద్దంగా, ప్రభుత్వ అనుమతుల మేరకే బస్సులు నడుపుతున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ పిచ్చోడిలా..
ముఖ్యమంత్రి కావాలంటూ జగన్ పగటి కలలు కంటున్నారని, కానీ ఆయన ఆశలు నెరవేరవని అన్నారు. 2019 ఎన్నికల తర్వాత నేనే ముఖ్యమంత్రి అంటూ రోడ్లపై జగన్ పిచ్చోడిలా తిరుగుతాడని జోస్యం చెప్పారు. జేసీ సోదరులపై అనవసర రాద్ధాంతం చేయడాన్ని జగన్ మానుకోవాలని సూచించారు.
చంపుతారేమో..
జగన్ కు సీఎం కావాలనే పిచ్చి పట్టింది.. అందుకే కలెక్టర్ ఎస్పీలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తమను చంపేస్తారేమోననని అన్నారు. చావు విషయంలో రాజకీయాలొద్దని సూచించారు. తాము దీన్ని ఇంతటితో వదిలిపెట్టమని జేసీ హెచ్చరించారు.
కొడుకుతోపాటు జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
ఇటీవల కృష్ణాజిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ‘సాక్షి' అవాస్తవమైన కథనాలను ప్రచురితం చేసిందంటూ.. జేసీ ప్రభాకర్రెడ్డి ఆ పత్రికా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో జేసీ ప్రభాకర్రెడ్డి ఆయన కుమారుడు అజ్మిత్రెడ్డిలను నగర డీఎస్పీ మల్లికార్జునవర్మ అరెస్టు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ధర్నాలు, నిరసనలకు అనుమతి లేదని నగర డీఎస్పీ స్పష్టం చేశారు. ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అజ్మిత్రెడ్డిలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కృష్ణా జిల్లా మూలపాడు వద్ద దివాకర్ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 11మంది మృతి చెందిన విషయం తెలిసిందే.