మాట్లాడేందుకు కత్తులు, కొడవళ్లతో వస్తారా? పెద్దారెడ్డి పెద్ద దొంగ: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం
అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో గత రెండ్రోజులుగా తాడిపత్రిలో రాజకీయ ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్తంగా మారింది వాతావరణం. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అతని అనుచరులు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి ఇంట్లోని ఇద్దరు యువకులపై దాడి చేయడంతో ఈ ఘర్షణ వాతావరణం మొదలైంది.
Recommended Video
కత్తులు, కొడవళ్లతో మాట్లాడేందుకా?
ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడేందుకు తన ఇంటికి వచ్చానంటున్నారని.. అలాంటప్పుడు కత్తులు, కొడవళ్లు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చిన సమయంలో తాను, తన కొడుకు ఇంట్లో లేమని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
ఈ ఘటనపై తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు.
పెద్దారెడ్డి చంబల్ లోయలోనే కరెక్ట్..
తాడిపత్రిలో తన ఇంటికి వైసీపీ వర్గీయులు వచ్చిన ఘటనపై సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు పెడితే 9 మంది పోలీసు సిబ్బంది కూడా ఇబ్బంది పడతారని చెప్పారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసులు పెట్టమంటే పైనుంచి తమపై ఒత్తిడి ఉందని పోలీసులు చెప్తున్నారని జేసీ తెలిపారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి చంబల్ లోయలో ఉండాల్సిన వ్యక్తి అని, 1990లో ఇళ్లు తగలబెట్టి బీరువాలో డబ్బులు ఎత్తుకెళ్లిన పెద్ద దొంగ అని జేసీ ఆరోపించారు.
కేసుపై నమ్మకం లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి..
సీఎస్ నుంచి ఎస్సై వరకు అందరికీ జరిగిన ఘటనపై సమాచారం ఇచ్చామని తెలిపారు. తనకు కేసుపై నమ్మకం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోలీసులు, అన్ని శాఖల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. తమ బస్సులకు అన్ని అనుమతులున్నా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తమ బస్సులకు ఇప్పుడు కాకపోతే ఏడాది, రెండేళ్ల తర్వాతైనా పర్మిట్లు వస్తాయన్నారు.
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు
గత రెండ్రోజులుగా తాడిపత్రి అట్టుడుకుతోంది. జేసీ ఇంటికి వెళ్లి దాడి చేశారంటూ పెద్దారెడ్డిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జేసీ ఇంటికి పెద్దారెడ్డి, అనుచరులు వెళ్లి దాడి చేసిన ఘటనలో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని కొంత ఘర్షణ తీవ్రతను తగ్గించారు. కాగా, జేసీ తరపు న్యాయవాది ఫిర్యాదుతో పెద్దారెడ్డి, అతని తనయుడు హర్షవర్ధన్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు మరో రెండు కేసులు పెట్టామని డీఎస్పీ చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీని సీఎస్, డీజీపీ, డీఐజీ, ఎస్పీ, డీఎస్పీ, సీఐలకు ఇచ్చామని జేసీ తరపు లాయర్ తెలిపారు. జేసీ మాత్రం ఫిర్యాదు చేయలేదని చెప్పిన విషయం తెలిసిందే.