కడప సెంట్రల్ జైలులో జేసీ ప్రభాకర్..అస్మిత్: ఖైదీ నంబర్లు ఇవే: విచారణ మొత్తం అక్కడే
అనంతపురం: ప్రైవేటు బస్సుల లైసెన్సుల ట్యాంపరింగ్, బీఎస్ సర్టిఫికెట్ల గోల్మాల్ వ్యవహారంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు, టీడీపీ తాడిపత్రి నియోజకవర్గం ఇన్ఛార్జి అస్మిత్ రెడ్డిలను ఎట్టకేలకు కడపలోని కేంద్ర కారాగారానికి తరలించారు. అనంతపురం జైలులో శిక్షను అనుభవిస్తోన్న ఓ ఖైదీకి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో అదే కారాగారాంలో నేతలిద్దరినీ తరలించడానికి జిల్లా పోలీసు అధికారులు అంగీకరించలేదు. రెండు, మూడు ప్రత్యామ్నాయ జైళ్లను పరిశీలించిన అనంతరం కడపకు తరలించారు.
కడప సెంట్రల్ జైలులో కొత్త ఖైదీ నంబర్లు
కడప కేంద్ర కారాగారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలకు ఖైదీ నంబర్లను కేటాయించారు. ప్రభాకర్కు 2077, అస్మిత్ రెడ్డికి 2078 నంబర్లను ఇచ్చారు. వారికి విధించిన 14 రోజుల రిమాండ్ ఇక కడప సెంట్రల్ జైలులోనే కొనసాగబోతోంది. 14 రోజుల రిమాండ్ ముగిసిన తరువాతా మళ్లీ అనంతపురానికి తీసుకెళ్లారు. అక్కడి జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చుతారు. ఆ తరువాతే వారిని ఏ జైలులో ఉంచాల్సి ఉంటుందనేది తేలుతుంది. బెయిల్ లభించకపోవడం, రిమాండ్ను పొడిగించాల్సిన పరిస్థితులు అంటూ తలెత్తితే.. మళ్లీ కడపకే తీసుకొస్తారని అంటున్నారు.
ఫోర్జరీల కేసు..
జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి రెండువేలకు పైగా ప్రైవేటు బస్సుల ఉన్నాయి. వాటిల్లో చాలా బస్సులను ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లల్లో రిజిస్ట్రేషన్ చేయించారు. తమ వద్ద ఉన్న 154 బస్సులకు సంబంధించిన లైసెన్సులను జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. లారీలను నడిపించడానికి అనుమతులు తీసుకుని బస్సులను నడుపుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. హైదరాబాద్లో వారిని అరెస్టు చేసి, అనంతపురానికి తీసుకొచ్చారు పోలీసులు. అనంతపురం జిల్లా న్యాయస్థానం ముందు హాజరు పరిచారు.
అనంతపురం నుంచి కడపకు..
ఈ సందర్భంగా న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీనితో వారిని- అనంతపురం జైలుకు తరలించాలని తొలుత అధికారులు నిర్ణయించగా..అక్కడ ఓ ఖైదీకి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా వారిని ఎక్కడ తరలించాలనే విషయంపై తర్జనభర్జనలు సాగాయి. ఏ జైలుకు తరలించాలనే విషయంపై మరోసారి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. గుత్తి, గుంతకల్లు, కదిరి, కడప సెంట్రల్ జైలు వంటి ప్రత్యామ్నాయాలను న్యాయమూర్తి ముందు ఉంచారు. కడప మినహా మిగిలిన పట్టణాల ఉప కారాగారాల్లో సౌకర్యాలు కొరత ఉందని భావించిన అనంతరం కడపకు తరలించడానికి న్యాయమూర్తి అనుమతించారు.
తాడిపత్రికి తరలించడం వల్ల
రిమాండ్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను తాడిపత్రి సబ్ జైలులో వారిని ఉంచాలనే ప్రతిపాదనను జిల్లా పోలీసులు కనీసం పరిశీలనలో కూడా తీసుకోలేదు. తాడిపత్రి జేసీ కుటుంబం స్వస్థలం కావడం వల్ల ఉద్రిక్తత తలెత్తుతుందని పోలీసులు భావించారు. జేసీ కుటుంబం అనుచరులు జైలు వద్ద ధర్పాలు, నిరాహార దీక్షలకు దిగే అవకాశాలు లేకపోలేదంటూ అనుమానించారు. ఫలితంగా పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉండటం వల్లే తాడిపత్రి జైలు పేరును పరిశీలనలోకి కూడా తీసుకోలేదు. ఏకంగా జిల్లానే మార్చేశారు.
Recommended Video
రోడ్డు మార్గంలో కడపకు తరలింపు..
గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత వారిని రోడ్డుమార్గంలో కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ సమయంలో వారి వెంట- తాడిపత్రి, అనంతపురం డీఎస్పీలు శ్రీనివాసులు, వీరరాఘవ రెడ్డి సహా కొందరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కడప కేంద్ర కారాగానికి చేరుకున్న అనంతరం అక్కడి అధికారులకు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అప్పగించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడానికి సుమారు 45 నిమిషాల సమయం పట్టినట్టు సమాచారం. అంతసేపు వారిద్దరూ ఖైదీలను కలవడానికి వచ్చే వారి బంధువులు, ఇతర కుటుంబీకులు నిరీక్షించడానికి కేటాయించిన గదిలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నట్లు సమాచారం.