బాబు మాత్రమే గట్టెక్కిస్తారు: జెసి కితాబు, జగన్కు ప్రశ్న
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగే నాయకుడు చంద్రబాబు ఒక్కడే అన్నారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి పాతికేళ్ళు వెనక్కి వెళ్ళిందన్నారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. కాగా, ఈ నెల 20వ తేదీన జెసి టిడిపిలో చేరనున్నారు.
వైయస్ జగన్ తీరు చూస్తుంటే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నట్టు ఉందన్నారు. సీమాంధ్రకు అన్నీ చేస్తానని చెబుతున్న జగన్ యువతకు ఏం చేస్తాడో చెప్పాలన్నారు. చంద్రబాబు పట్ల తమకు విశ్వాసముందన్నారు. సీమాంధ్రను అభివృద్ధి చేయగల సమర్థుడు ఆయనే అన్నారు.
కేజ్రీ పార్టీతో పొత్తుండదు
ఇన్నేళ్లుగా పనికిరాని పార్టీలకు ఓట్లు వేస్తున్నారని, వాళ్లేం చేశారని ప్రజలు ఆలోచించాలని లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ విజయవాడలో అన్నారు. నిజాయితీగా, నిస్వార్థంగా ఉండి ప్రజల అభిమానాన్ని సంపాదించిన వారికి మద్దతివ్వాలన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని చెప్పారు.
అందరు కలిసి పని చేశారు: కిషన్ రెడ్డి
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టులు ఏకతాటిపై నిలిచారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. వారు ఏ సంస్థలో పని చేస్తున్నా తెలంగాణ కోసం పోరాటమే తమ విధానమని స్పష్టంగా చాటారని కితాబిచ్చారు. హైదరాబాదులో జరిగిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సభలో ఆయన మాట్లాడారు.
సుదీర్ఘ పోరాటాలు, బలిదానాల అనంతరం తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్రజల్లోకి తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం జర్నలిస్టులు విశేష కృషి సల్పారని కిషన్ రెడ్డి ప్రశంసించారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులుగా తాము తప్పు చేసినా, నిలదీసే హక్కు జర్నలిస్టులకుందన్నారు.
సీమాంధ్ర హక్కుల రక్షణకు: పితాని
సీమాంధ్ర హక్కుల రక్షణకే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడుతున్నారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఆయన హైదరాబాదులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమైక్యత కోసం తాము ఎంతో పోరాడామన్నారు. రాజకీయ స్వార్థం కోసమే విభజన చేశారని, రాజకీయ విలువలను, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. కిరణ్ పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారని, రాజమండ్రి సభలో జెండా, అజెండా చెబుతారన్నారు.