మహానుభావుడు వస్తాడనుకున్నా, కానీ, జగన్ వ్యాపారం చేసుకొని ప్రశాంతంగా గడపాలి: జెసి
తాను రాజీనామా చేస్తే ఎవరైనా మహానుభావుడు వచ్చి ప్రజల బాధలు తీరుస్తారనే ఉద్దేశ్యంతోనే తాను లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని అనంతపురం ఎంపీ, టిడిపి నేత జెసి దివాకర్ రెడ్డి అన్నారు.
అనంతపురం: తాను రాజీనామా చేస్తే ఎవరైనా మహానుభావుడు వచ్చి ప్రజల బాధలు తీరుస్తారనే ఉద్దేశ్యంతోనే తాను లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని అనంతపురం ఎంపీ, టిడిపి నేత జెసి దివాకర్ రెడ్డి అన్నారు.
జగన్ గురించి మాట్లాడుతూ.. జగన్ రాజకీయాలు మాని వ్యాపారాలు చూసుకుంటే మంచిదన్నారు. సిబిఐతో పాటు కోర్టు కేసులు పరిష్కరించుకొని జగన్ హాయిగా, ప్రశాంతంగా గడపాలన్నారు. జగన్ శ్రేయోభాలాషిగా ఇది చెబుతున్నానని తెలిపారు.
రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకున్నా
ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తన రాజీనామా నిర్ణయాన్ని తాను వెనక్కి తీసుకున్నానని తేల్చి చెప్పారు. అనంతపురం ప్రజల కష్టాలు తీరుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని, అందుకే రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని చెప్పారు.
అందుకే రాజీనామా చేయాలనుకున్నా
కొంత బాధాకర హృదయంతో తాను రాజీనామాపై కామెంట్ చేశానని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. నా వాళ్లకు ఉపయోగపడనప్పుడు నాకు ఈ ఎంపీ పదవి ఇందుకని భావించానని, అందుకే రిజైన్ చేయాలని అనుకున్నానని చెప్పారు.
చంద్రబాబుకు రుణపడి ఉన్నాం
తాను రాజీనామా చేస్తే ఎవరైనా మహానుభావుడు వచ్చి బాధలు తీరుస్తారనే భావంతో రిజైన్ చేయాలని అనుకున్నానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. కానీ అంతలోనే సీఎం చంద్రబాబు గట్టిగా స్పందించి, అనంత ప్రజల సమస్యలు తీరుస్తానని చెప్పారని అన్నారు. లిఖిత పూర్వకంగా జీవో జారీ చేశారు కాబట్టి మా ప్రాంతవాసులు అతనికి రుణపడి ఉన్నామన్నారు.
జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలి
కాగా, అంతకుముందు వైసిపి అధినేత జగన్ పైన జేసీ మండిపడ్డారు. అక్రమాస్తుల కేసులో ఉన్న జగన్ పాదయాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యే పరిస్థితి లేదని చెప్పారు. జగన్ రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదన్నారు.